Tuesday, May 7, 2024

బీసీలకు లక్ష సాయం.. 53 వేల దరఖాస్తులు: మంత్రి గంగుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న వెనుకుబడిన వర్గాల కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకు 53 వేల దరఖాస్తులు వచ్చాయి. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్‌ రూ.లక్ష ఆర్థిక సహాయం అంశంపై ఉన్నత స్థాయి సమీక్షను సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 53 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని ఆయన తెలిపారు. కులవృత్తులకు ఘనవైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ.లక్ష సహాయం ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఈనెల 20వ తేదీ వరకు పథకానికి సంపూర్థంగా ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరంలేదన్నారు. ఆదాయ ధృవపత్రాలు సైతం 2021 ఏప్రిల్‌ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం అవసరార్థుల ఆదాయ సర్టిఫికెట్‌ల జారీపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. దరఖాస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న దరఖాస్తులను తమ స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి సమర్పించవచ్చని ఆయన సూచించారు.

- Advertisement -

ఆన్‌లైన్‌లోనే బీసీ హాస్టళ్ల సీట్లు భర్తీ…

రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలోని సీట్లను ఇకనుండి ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి గంగుల అన్నారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను సచివాలయంలో అధికారికంగా ఆయన ప్రారంభించారు. ఈ విద్యాసంవత్సరం నుండే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement