Thursday, May 2, 2024

TS | ధరణిలో సరికొత్త మాడ్యూల్స్‌.. 25నుంచి అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్నికల షెడ్యూల్‌లోపే ధరణిలో ఇబ్బందికరంగా ఉన్న అన్ని సమస్యలకు ముగింపు పలికి, రైతు ఫ్రెండ్లీగా పోర్టల్‌ను మార్చే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా జఠిలమైన మరో 8 సమస్యలను తేల్చేందుకు వీలుగా ఆప్షన్లను ధరణిలో తీసుకొచ్చారు. ఇవి నేటునుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ప్రధానంగా సేత్వార్‌ ఎంట్రీ, ఎడిట్‌ ప్రాసెస్‌, మార్కెట్‌ వ్యాల్యూ రిపోర్టు, ఇద్దరికంటే ఎక్కువమంది కలిసి చేసుకునే విక్రయ, బహుమతి ట్రాన్షాక్షన్లకు అనుమతింసస్తూ కొత్త అప్షన్‌ను అమలులోకి తెచ్చారు. అదేవిధంగా రుణాలు, మార్టిగేజ్‌లు చేసుకునే సమయంలో ఇకమీదట కులం అనే ప్రస్తావన అడగకుండా మ్యాడ్యూల్‌ను సవరించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకులు ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేరు తప్పుగా నమోదైనా, స్త్రీ, పురుష లింగ తప్పుల కరెక్షన్‌కు, ఆధార్‌ కరెక్షన్‌, కులంలో తప్పుల నమోదుల సరిజేతకు ప్రస్తుతం టీఎం 33లో ఇతర సరిజేతల విభాగంలో ఉన్న మ్యాడ్యూల్‌నుంచి తొలగించారు. ఇందుకు ప్రత్యేక మ్యాడ్యూల్‌ను తెరపైకి తెచ్చారు. భూమి స్వభావం, భూమి వర్గీకరణ, భూమి అనుభవదారుల విషయంలో అసైన్డ్‌ భూమిగా నమోదైతే మిగతా ఆప్షన్లలో కూడా అసైన్డ్‌ భూమిగానే పరిగణించాలని నిర్ణయించారు. తిరస్కరించిన దరఖాస్తుల స్టేటస్‌ పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌ ప్రాసెస్‌లో ధరణిలో వీక్షించేందుకు వెసులుబాటు కల్పించారు. గ్రామ పహాణీ రిపోర్టులను సీసీఎల్‌ఏ, కలెక్టర్ల లాగిన్‌లలో ఉంచేలా తాజాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో అనేక సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుంది.

ఇప్పటికే రైతులకు ధరణి సమస్యలు, అప్లికేషన్ల వ్యవస్థలో అవగాహనకు జిల్లాల్లోని కలెక్టరేట్లలో ధరణి హెల్ప్‌ డెస్క్‌లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. దీంతో చిన్న చిన్న సమస్యలు జిల్లా స్థాయిలోనే పరిష్కారమవుతాయని, రైతులు శ్రమకోర్చి వ్యయప్రయాసలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని భావిస్తున్న అధికారులు ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. మాడ్యూల్‌ 33లో సర్వే నెంబర్‌, ఖాతా నెంబర్‌ మిస్సింగ్‌, భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు తీరనున్నాయి. ఇక యాజమాని పేర్లు తప్పులు, తండ్ర, భర్త పేర్ల తప్పులు తదితర అనేక సమస్యలకు చెందిన పెండింగ్‌ దరఖాస్తులు త్వరలో తీరనున్నాయి. వీటిని సత్వరం పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.

సర్వం సిద్ధం…
భూ యాజమాన్య హక్కులకు ఆమడ దూరంలో నిల్చిన రైతులకు ఉపశమనం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 40 రకాల సమస్యల పరిష్కారంలో తప్పుల సవరణకు పలు మ్యాడ్యూల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. 5లక్షల మంది రైతులు ఇతర కారణాలతో భూ హక్కుల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి మారనున్నది. ఇప్పటికే పాస్‌ పుస్తకాల్లో తప్పులు, సర్వే నెంబర్ల నమోదులో ఇబ్బందులు, ఖాతా నెంబర్లు లేని భూములు, నిషేదిత జాబితా, నాలా భూమిగా నమోదు, ఎసైన్డ్‌, ఇనాం భూముల హక్కులు, సాగులో ఉన్నా సాగేతర భూమిగా నమోదు, మైనర్ల ఫోటోలు పాస్‌ పుస్తకాలపై ముద్రించడం. మ్యుటేషన్‌కు ముందు యజమాని మరణిస్తే సమస్యలు, వారసత్వ బదలీలు, ధరణికి ముర్దు రద్దయిన రిజిస్ట్రేషన్‌ స్లాట్లకు సర్వే సంఖ్య కాకుండా విస్తర్ణం ఆధారంగా అవకాశం వంటి అనేక సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. పలు సమస్యలు తీరిపోయాయి.

- Advertisement -

వారసత్వ ఆస్తుల బదలీలలో కుటుంబ అఫిడవిట్‌ను ప్రామాణికంగా ధరణిలో తీసుకుంటున్నారు. వారసత్వ భూములను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అమ్ముకునే వీలు గతంలో లేదు. ధరణి వచ్చాక ఎవరిపేరు మీద ఉంటే వారు అమ్ముకునే స్వేచ్చ అమలులోకి వచ్చింది. రికార్డుల్లోకి ఎక్కని రైతులకు మార్గం లేకుండా పోయింది. అసైన్డ్‌ చట్టం ప్రకారం అసైనీలు చనిపోతే ఆ భూములను వారసుల పేర్లమీద మార్చాలి. కానీ అది జరగడంలేదు. డిజిటల్‌ సిగ్నేచర్‌ కాని, పాస్‌ పుస్తకాలు జారీ కాని భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలా 11 లక్షల ఎకరాల భూములకు హక్కులులేవని పాస్‌ పుస్తకాలు నిరాకరించిన హక్కుల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. ఇంకా మరో 3.5లక్షల మందికి పెండింగ్‌ పాస్‌ పుస్తకాల జారీతోపాటు 2.5లక్షల మంది రైతులకు చెందిన రికార్డుల తప్పుల సరిజేత దిశగా యోచిస్తోంది.

సబ్‌ కమిటీ చేసిన సిఫార్సులే కీలకం…
ధరణిలో సమస్యల పరిష్కారం దిశగా సబ్‌ కమిటీ కీలక నివేదికను సిద్దం చేసింది. పలు అంశాలతో కూడిన సిఫార్సులను సిద్దం చేసి 34 రకాల సమస్యలకు పరిష్కారమార్గాలుగా కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఈ నేపథ్యంలో టీఎం 33 మ్యాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మ్యాడ్యూల్‌ కింద దరఖాస్తులకు నోటీసుల జారీ పురోగతిలో ఉంది. ప్రధానంగా పేరులో మార్పులు, చేర్పులు, విస్తీర్ణంలో మార్పులు, సర్వే నెంబర్‌ తొలగింపు, ఎన్వోసి, ఓఆర్సీ, 38ఈ, 13బి, సర్వే నెంబర్‌ను భిన్నమైన ఖాతాలకు మళ్లించడం, అసైన్డ్‌ భూములను పట్టాభూములుగా రికార్డుల మార్పు, ల్యాండ్‌ నేచర్‌, ల్యాండ్‌ టైప్‌ మార్చడం, మిస్సింగ్‌ నెంబర్‌, కొత సర్వే నెంబర్‌ను సృష్టించడం, కొత్త ఖాతా సృష్టి, లావాదేవి నిలుపుదల, ఖాతాల విలీనం వంటి వాటిపై స్పష్టత రావడంతో మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

ఇంకా కొన్ని…
భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించిన భూముల సర్వే నెంబర్లలలోని మొత్తం పట్టా భూములను నిషేదిత జాబితాలో చేర్చడం, కోర్టు కేసులు, ఇతర వివాదాలున్న సర్వే నెంబర్లను ఈ జాబితాలో ఉంచడం, వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో కొన్ని సర్వే నెంబర్లలోని భూములు నమోదు కాలేదు. ఈ మిస్సింగ్‌ డేటాను సేత్వార్‌, ఖాస్రా పహాణీలో ఉన్న విస్తీర్ణం కంటే తక్కువగా ఉండే వాటి నమోదుకు అవకాశం కల్పించి ఆయా రైతులు రైతుబంధు, రైతు భీమా పథకాలకు అర్హులుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. ఇందుకోసమే కొత్త అప్షన్లు అందుబాటులోకి తెచ్చింది.

నాలా మార్పిడితో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతారని, ఈ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకులలో తనఖా పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయేతర భూమిగా నమోదైన వ్యవసాయ భూమిని భూమి వర్గీకరణ మార్పుకు అవకాశం కల్పించి రైతులకు పాస్‌ పుస్తకాల అందజేత వంటి పరిష్కారాలను యోచిస్తున్నారు. గజాలలో ఉన్న భూములకు కూడా మ్యుటేషన్‌ అవకాశం కల్పించాలని, ప్రభుత్వ అసైన్డ్‌ భూముల విషయంలో అమ్మకాలు, కొనుగోలు మినహా మిగతా వ్యవహారాలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదనంగా డిజిటల్‌ సంతకాలు, తప్పుల సవరణలకు అవకాశం కల్పించాలని కూడా సిఫార్సులు చేయనున్నారు. నిషేదిత భూముల జాబితాను సబ్‌ డివిజన్‌ నెంబర్ల ఆధారంగా తిరిగి నమోదు చేయాలని, సంబంధంలేని మిగతా భూములను జాబితానుండి తొలగించనున్నారు.

స్పెషల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీతో క్రయవిక్రయదారులకు అవకాశం ఇచ్చే దిశగా యోచిస్తున్నారు. సర్వే నెంబర్‌ విస్తీర్ణంలో మార్పులకు, ఆధార్‌కు బదులుగా సంస్థ పాన్‌ కార్డుతో రిజిస్ట్రేషన్లకు అవకాశం పరిశీలిస్తున్నారు. తిరస్కరించిన మ్యుటేషన్‌ దరఖాస్తులకు మళ్లి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అమలులోకి తేనున్నారు. సంస్థ భాగస్వాముల రిజిస్ట్రేషన్‌లో సీఐఎన్‌ బదులుగా పాన్‌ నెంబర్‌ను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement