ఎముకలలో సైతం వణుకు పుట్టించేలా యాక్షన్ థ్రిల్లర్లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన రామ్గోపాల్ వర్మ మరోమారు పూర్తి యాక్షన్ కథాంశంతో తిరిగిరాబోతున్నారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంలో తీర్చిదిద్దబడిన కథాంశాన్ని ‘దహనం’ పేరిట ఏడు ఎపిసోడ్ల సిరీస్గా ప్రేక్షకుల ముందుకు ఎంఎక్స్ ప్లేయర్ తీసుకురానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ఇషా కొప్పికర్, అభిషేక్ దుహన్, నైనా గంగూలీ, అశ్వత్కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే మరియు ప్రదీప్ రావత్లు అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్ చేయనున్నారు. అత్యంత ఆసక్తి కలిగించే ఈ డ్రామాకు సంబంధించిన ఎపిసోడ్లు అన్నీ కూడా ఎంఎక్స్ ప్లేయర్ వద్ద 14 ఏప్రిల్ 2022 నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రసారం కానున్నాయి.
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ షో గురించి రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ… తన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘దహనం’ను ఎంఎక్స్ ప్లేయర్ భాగస్వామ్యంతో రూపొందించడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. ఈ కథనం రెండు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు నడుమ దాగిన చీకటి కోణాన్ని స్పృశిస్తుందన్నారు. అవేమిటంటే, ‘కంటికి కన్ను అని అనుకుంటూ వెళ్తే ప్రపంచాన్ని గుడ్డిగా మార్చడంలో మాత్రమే మనం విజయం సాధించగలమని మహాత్మాగాంధీ చెబుతారు. కానీ మహాభారతంలో మాత్రం ‘ప్రతీకారం అనేది పూర్తిగా స్వచ్ఛమైన ఓ భావోద్వేగం’ అని చెబుతుందన్నారు. ‘దహనం’ వెబ్ సిరీస్లో కేవలం ప్రతీకారం గురించి మాత్రమే వెల్లడించడం కాదు, ఆ ప్రతీకార పర్యవసానాలు కూడా చర్చించామన్నారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు, కానీ థ్రిల్లింగ్ క్రైమ్స్తో కూడినదన్నారు. ఊపిరిబిగపట్టి చూసేలా వీటిని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ షోతో తాము కేవలం ఓ అడుగు ముందుకేయడం కాదు, కథ డిమాండ్ చేసిన తీరుతో తమ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసిన నటీనటుల అద్భుత నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్నో మైళ్ల దూరం వెళ్లగలిగామన్నారు. ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి తమ మొత్తం బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంద అని అన్నారు.