Wednesday, May 1, 2024

చిన్నారిని న‌డుంకి క‌ట్టుకుని ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డిన త‌ల్లి ..

కుటుంబ‌క‌ల‌హాల నేప‌థ్యంలో వారు బ‌ల‌వ‌న్మ‌రణానికి పాల్ప‌డ‌ట‌మే కాదు .. పిల్ల‌ల‌ను బ‌లి చేస్తున్నారు ప‌లువురు త‌ల్లి దండ్రులు.. ఈలాంటి సంఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మిడ్జిల్ మండ‌ల కేంద్రంలో జ‌రిగింది. తొమ్మిది నెల‌ల చిన్నారిని త‌న నడుముకు క‌ట్టుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత (20)కి మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ళ కిందట వివాహమయ్యింది. వీరికి 9 నెలల చిన్నారి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత మనస్థాపానికి గురై చిన్నారితో కలిసి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా..మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో గ్రామ శివారులోని నీటి కుంటలో తల్లి, కుమార్తె మృత‌దేహాలను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిని సరిత తన నడుముకు కట్టుకుని సూసైడ్ చేసుకుంది. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి… పోస్టుమార్టం నిమిత్తం జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే సరిత బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ జయ ప్రసాద్ వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement