Tuesday, April 30, 2024

భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించండి.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన ఎంపీ కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో భువనగిరి, జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు రాయగిరి వరకు ఎం.ఎం.టీ.ఎస్ సేవలను పొడిగించాలని భువనగిరి ఎంపీ (కాంగ్రెస్) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి పలు వినతి పత్రాలు అందజేశారు. తన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎంతో అవసరమని, తెలంగాణలో ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లలో భువనగిరి ఒకటని అన్నారు.

యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ స్టేషన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరి గుట్టను దర్శించుకోవడం కోసం ప్రతి రోజు వేల మంది భక్తులు వస్తుంటారని గుర్తుచేశారు. అలాగే భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు నిత్యం హైదరాబాద్‌‌కు రాకపోకలు సాగిస్తుంటారని చెప్పారు.

మరోవైపు జనగామ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాగా ఏర్పడిందని, ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్‌కు రోజూ అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు రాకపోకలు సాగిస్తుంటారని కేంద్ర మంత్రికి తెలిపారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న భువనగిరి, జనగామ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఘట్‌కేసర్ వరకు సేవలు అందజేస్తున్న ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంఎటీఎస్‌ రెండోదశకు 2:3 నిష్పత్తి ప్రకారం పనులు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుని ఏళ్లు గడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఆలస్యం కారణంగా ఇది కార్యరూపం దాల్చడం లేదని తెలిపారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి భాగస్వామ్యం లేకుండానే వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థనపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కేంద్రమే మొత్తం ఖర్చు భరించి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement