Monday, May 6, 2024

మొండి బాకీలపై దృష్టి సారించాలన్న ఆర్థిక శాఖ.. బ్యాంకర్ల సమావేశంలో సూచన

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వార్షిక పనితీరు, రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆర్థిక శాఖ సమీక్షించింది. ఈ సమావేశానికి నిర్మాలాసీతారామన్‌ బదులుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కె.కరాడ్‌ హాజరయ్యారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలు, ఆర్థిక వృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని, ఉత్పత్తి రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు కోరారు. నిరర్ధక ఆస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్థిక శాక బ్యాంక్‌లను కోరింది. రుణాల మంజూరీలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, వ్యాపార వృద్ధి ప్రణాళికలు వంటి అంశాలను సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

బ్యాంక్‌ల వద్ద వంద కోట్లకు పైగా ఉన్న ఎన్‌పీఏల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇలాంటి వాటిని సాధ్యమైనంత రికవరీ చేయాలని అధికారులు సూచించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, అత్యవసర రుణ హామీ పథకం, ఇతర ప్రభుత్వ పథకాల అమలు కూడా చర్చించారు. అత్యవసర రుణ హామీ పథకం అమలును 2023 మార్చి 31 వరకు పెంచారు. ఈ పథకానికి గ్యారంటీ రుణ కవర్‌ను 50 వేల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు పెంచారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల లాభాలు క్రితం సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. ఈ బ్యాంక్‌ల మొత్తం నికర లాభం 66,539 కోట్లకు పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి నికర లాభం 31,820 కోట్లు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement