Wednesday, May 8, 2024

ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

ములుగు : ములుగు జిల్లాలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్‌ అలీతో కలిసి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయానికి, దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్‌ బస్టాండ్‌ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని శిల్ప సంపదను తిలకించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. రామప్ప చెరువు కట్ట వద్దకు చేరుకొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించి, అక్క‌డే ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30లక్షలతో నిర్మించే డిజిటల్‌ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్‌ హాల్‌ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాధన స్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement