Friday, April 26, 2024

మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు.. కేబినెట్ నుంచి ఈటల అవుట్?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.

దాదాపు నాలుగున్నరేళ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టాక్​. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరోవైపు మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం మీడియాలో వైరల్​గా మారింది. టీఆర్​ఎస్​ పార్టీ అధికారిక ఛానల్​గా గుర్తింపు ఉన్న టీ న్యూస్​లో కూడా ‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జా రోగం’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదే పదే రావడం సంచలనంగా మారింది.

కాగా ఈ వ్యవహారంపై తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును కూడా సీఎం ఆదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement