Thursday, May 2, 2024

రేపు మావోయిస్టుల బంద్

ఆపరేషన్ ప్రహార్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఈనెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు రకరకాల అలజడి సృష్టిస్తున్నారు. నారాయణపూర్ జిల్లాలో అటవీశాఖ పనులు చేస్తున్న జెసీబీని నక్సల్స్ ఆదివారం తగులబెట్టారు. ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతాలపై నక్సల్స్ ప్రభావం సరిహద్దు తెలంగాణ ఏజెన్సీపై పడకుండా ఇక్కడి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆదివారం చర్లలో జరుగుతున్న సంతకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. అనుమానిత ఆదివాసీలను తనిఖీలు చేసి ఆరా తీశారు.

‘మావోయిస్టుల బంద్‌లు.. ఆదివాసీల ఇబ్బందులు’ అంటూ చర్ల, దుమ్మగూడెం మండలాల్లో పలుచోట్ల ఆదివాసీ సంఘాల పేరుతో కరపత్రాలు వెలిశాయి. ఆ కరపత్రాల్లో మావోయిస్టుల వైఖరిని ఎండగట్టారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, బలవంతంగా ఆదివాసి యువతులను ఉద్యమంలోకి లాగి వారి జీవితాలను దుర్బరం చేస్తున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. బంద్‌కి ఒకరోజు ముందు బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో వెలసిన కరపత్రాలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement