Friday, May 3, 2024

రష్యాకు భారీ నష్టం, ఉక్రెయిన్‌ ప్రతిఘటనతో ఉక్కిరిబిక్కిరి.. కీలక దళాలను కోల్పోయిన పుతిన్‌ సేన

ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో దండయాత్రకు దిగిన రష్యా అనూహ్యంగా ఎదురుదెబ్బలు తిందని, భారీగా ప్రాణనష్టాన్ని చవిచూసిందని, యుద్ధ సామాగ్రి, ఆయుధ సంపత్తిని పెద్దఎత్తున కోల్పోయిందని బ్రిటన్‌ రక్షణశాఖ వెల్లడించింది. రష్యా బలగాల్లో అత్యంత సమర్ధమైన విభాగాల్లో ఈ నష్టం మరీ ఎక్కువగా జరిగిందని స్పష్టం చేసింది. బ్రిటన్‌ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అందించిన తాజా నివేదికలో ఈ వివరాలున్నాయి. వేలాది సైనికులను, ప్రత్యేకించి దళాలను ముందుండి నడిపే హోదాల్లోని సైనికాధికారులను పెద్దసంఖ్యలో కోల్పోయిందని ఆ నివేదిక పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన అత్యాధునిక 7-90 యుద్ధట్యాంక్‌ను ఉక్రెయిన్‌ ధ్వంసం చేసిందని స్పష్టం చేసింది. రష్యా వద్ద ప్రస్తుతం ఈ తరహా యుద్ధట్యాంకులు కేవలం 100 మాత్రమే ఉన్నాయి. కాగా ఉక్రెయిన్‌పై యుద్దం నేపథ్యంలో ఐరోపా సహా ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయుధాల తయారీ వేగం మందగించనుంది. కాగా శనివారంనాడు నల్లసముద్రంలోని స్నేక్‌ఐలాండ్‌ సమీపంలో రష్యాకు చెందిన నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. బేరక్తార్‌ టిబి2 క్షిపణిని ప్రయోగించి పేల్చేశామని ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంలో విజయానికి సంకేతంగా రష్యా నిర్వహించనున్న విజయోత్సవాలను ఈసారి స్నేక్‌ ఐలాండ్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఈ దాడికి పాల్పడింది. మే 9న ఈ ఉత్సవాలు జరగనుండగా, అదే రోజు ఉక్రెయిన్‌పై పూర్తి యుద్ధాన్ని ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ కాస్త దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఒడెసా నగరంపై రష్యా దాడి..

ఉక్రెయిన్‌లో మరో నౌకాశ్రయం ఉన్న కీలక నగరం ఒడెశాపై రష్యా విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది. శనివారం ఉదయాన్నే వరుసగా నాలుగు క్షిపణులను ప్రయోగించి విధ్వంసానికి పాల్పడిందని ప్రాంతీయ పరిపాలనావిభాగం అధికార ప్రతినిధి బ్రాత్‌చుక్‌, ఎంపీ లీసా వసిలెంకో ప్రకటించారు. మౌలిక వసతులను ధ్వంసం చేయడమే కాకుండా ప్రజలను మానసికంగా బలహీనులను చేసే దిశగా రష్యా వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డాచ్నే సమీపంలోని 18 ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.

కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ..

పోర్ట్‌సిటీ మరియపోల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. శుక్ర, శనివారాలలో దాదాపు 100మందిని తరలించారు. మరికొందరిని వేగంగా తరలించగలమని అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా మరియపోల్‌లో పరిస్థితులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. మరియపోల్‌లో రష్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోందని, అకృత్యాలకు పాల్పడుతోందని, పౌరులను, సైనికులను దారుణంగా హింసిస్తోందని ఆరోపించారు. శనివారం కనీసం 40మంది మహిళలు, చిన్నారులను సురక్షితంగా తరలించామని, ప్లాంట్‌లో చిక్కుకుపోయిన సైనికులను కాపాడేందుకు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. కాగా పెద్దఎత్తున ఉక్రెయిన్‌ శరణార్థులను ఆదుకుంటున్న రొమేనియా ప్రభుత్వాన్ని అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ ప్రశంసించారు. స్లొవేకియా, రొమేనియాలలో నాలుగు రోజులు పర్యటించనున్న ఆమె శనివారం రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలో మాట్లాడారు.

- Advertisement -

ఉక్రెయిన్‌కు 150 మిలియన్‌ డాలర్ల సాయం – బిడెన్‌..

రష్యాతో ఢీ అంటే ఢీ అంటూ పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరో 150 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించే ప్యాకేజీని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ప్రకటించారు. రక్షణ, మానవతా సాయంకోసం ఇస్తున్న మొత్తం ఉక్రెయిన్‌కు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాడార్లు, ఫిరంగులు, మరియపోల్‌లో చిక్కుకుపోయినవారిని అదుకునేందుకు ఈ నిధులను వినియోగిస్తారని చెప్పారు. శత్రుదేశం ప్రయోగించే క్షిపణులు, రాకెట్లను పసిగట్టే రాడార్‌ వ్యవస్థలను, ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ సామాగ్రిని అందిస్తామని ఆయన చెప్పారు. కాగా ఆదివారంనాడు జి-7 దేశాల వర్చువల్‌ భేటీ జరగనుంది. ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆహ్వానం అందింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement