Tuesday, May 7, 2024

Delhi | చర్లపల్లి టెర్మనల్‌కు దారి కల్పించండి.. కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు చేరుకునే రహదారికి అవసరమైన భూకేటాయింపులు జరపాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి రాసిన లేఖను కేంద్ర మంత్రి కార్యాలయం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, రద్దీ కారణంగా ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచీగూడా స్టేషన్లపై అధికభారం పడుతోందని, ఈ పరిస్థితుల్లో చర్లపల్లి వద్ద రైల్వే శాఖ ఒక టెర్మినల్ నిర్మాణం చేపట్టిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద అదనపు ప్లాట్‌ఫాంతో పాటు టెర్మినల్ నిర్మాణం సహా అనేక అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తికావొస్తున్న నేపథ్యంలో చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే మార్గాన్ని విస్తరించడం కోసం భూకేటాయింపులు జరపాల్సిందిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే కోరింది. రైల్వేస్టేషన్‌కు వెలుపల ఇరువైపులా ప్రయాణికులు, వాహనాలు రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి వీలుగా అప్రోచ్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది. అలాగే, పార్కింగ్ తదితర అవసరాల కోసం స్టేషన్‌కు ఇరువైపులా అవసరమైన అదనపు భూమిని కేటాయించాల్సి ఉంది.

FCI గోడౌన్ రోడ్డు నుండి కొత్త స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఈ రహదారి చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు రాకపోకలు సాగించటానికి ప్రధాన రహదారిగా మారనున్న నేపథ్యంలో అందుకు తగిన భూకేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే భరత్ నగర్ వైపు (ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు పక్కగా) నుంచి చర్లపల్లి స్టేషన్ కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉంది.

- Advertisement -

దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలి. మరోవైపు చర్లపల్లి స్టేషన్‌లోని ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాంను చేరుకునే రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. ఈసీ నగర్ ప్రధాన రహదారి నుండి స్టేషన్‌ను చేరుకునే ఈ రోడ్డును కనీసం 100 మీటర్ల వెడల్పుతో 700 మీటర్ల పొడవున అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటితో పాటుగా చర్లపల్లి స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం వైపు 2.7 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల నిమిత్తం కేటాయించాల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో ముఖ్యమంత్రికి గుర్తుచేశారు.

చర్లపల్లి టెర్మినల్‌కు నీటి సరఫరా కనెక్షన్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం రూ.4 కోట్లను రైల్వే శాఖ ఇప్పటికే జమ చేసింది. ఈ నీటి కనెక్షన్‌ను కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. వీటితో పాటుగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు టెర్మినల్‌ను చేరుకోవడానికి ఇప్పుడు ఉన్న రహదారి చాలా ఇరుకుగా ఉంది. ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలుగా ఆల్ఫా హోటల్ నుండి రేతిఫైల్‌ బస్టాండ్ వరకు ఉన్న రహదారిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలని ప్రతిపాదించింది.

మరోవైపు మౌలాలీ యార్డ్ స్టేషన్ పరిధిలో స్టేషన్‌కు ఇరువైపులా నివసిస్తున్న కుటుంబాల నుండి మురుగునీరు రైల్వేట్రాక్ మీదకు వస్తోంది. ఈ మురుగునీటి కారణంగా, ట్రాక్‌లు మునిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జిల విస్తరణకు ఇదివరకే పనులు కూడా మంజూరయ్యాయి. ఈ పరిస్థితుల్లో మునిసిపల్ ఏరియా పరిధిలోని డ్రైనేజీ వ్యవస్థను ఇప్పుడున్న 2 మీటర్ల నుండి 4.8 మీటర్లకు విస్తరించాలని కూడా రైల్వే శాఖ సూచించింది. ఈ అంశాలపై రైల్వే శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక కూడా ఇచ్చినట్టు కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ.. గతంలో  పలుమార్లు నాటి ముఖ్యమంత్రికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నగరానికి ఎంతో అవసరమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను తక్షణమే అందించేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement