Saturday, May 18, 2024

Delhi | మధుయాష్కి మోసగాడు.. దొంగ సర్టిఫికెట్లతో అమెరికా వెళ్లాడు : గోనె ప్రకాశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కిని లక్ష్యంగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు విరుచుకుపడ్డారు. ఆయనొక మోసగాడని, దొంగ సర్టిఫికెట్లు, తప్పుడు ధృవపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మరీ గోనె ప్రకాశ్ తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. న్యూయార్క్‌లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు యాష్కీని ప్రాక్టీస్ చేయకుండా నిషేధించిందని అన్నారు.

తాను కాకతీయ, గుల్బర్గా యూనివర్సిటీల నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించానని అన్నారు. తాను చావుకు కూడా భయపడనని, మధుయాష్కీపై హైకోర్టులో పోరాడుతున్నానని తెలిపారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఒక్క అంశంపై కూడా మధుయాష్కీ మాట్లాడలేదని అన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి మధుయాష్కి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని, ఆయన వల్ల ఓ 10 స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అన్నారు. కర్ణాటకలో తన వల్లనే రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటున్న మధుయాష్కి మరి నిజామాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాలో అక్రమాలకు పాల్పడిన మధుయాష్కిని ఇంటర్‌పోల్ పట్టుకుంటుందని, జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement