Friday, April 26, 2024

మాట్లాడుకుందాం రండి.. రైతులకు అమిత్‌ షా పిలుపు..

న్యూఢిల్లీ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఏడాది పాటు సాగిన ఆందోళనలు విజయవంతం కావడంతో.. మిగిలిన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహానించారు. ఈ నేపథ్యంలో.. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను రైతు సంఘాలు ప్రకటించాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించిన ఈ బృందం.. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తుంది. రాకేశ్‌ తికాయత్‌తో పాటు గుర్నామ్‌ సింగ్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, అశోక్‌ ధావ్లే, శివకుమార్‌, యుద్‌వీర్‌ సింగ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని భారతీయ కిసాన్‌ మోర్చా యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ అన్నారు. కమిటీని ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. కేంద్రమే మూడు సాగు చట్టాల రద్దును ఆలస్యం చేసిందని విమర్శించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా శుక్రవారం రాత్రి చర్చలకు రావాలని తమను ఆహానించారని, చర్చలు విజయవంతం అయితే.. ఉద్యమాన్ని ఆపేస్తామని కూడా ప్రకటించారు.

7వ తేదీన మళ్లీ భేటీ
సంయుక్త కిసాన్‌ మోర్చా తదుపరి సమావేశం డిసెంబర్‌ 7న జరుగుతుందని రాకేశ్‌ తికాయత్‌ చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును కేంద్రం ఆమోదించిన వారంలోపు సంయుక్త కిసాన్‌ మోర్చా తదుపరి సమావేశం జరగనుండటంతో.. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత, కనీస మద్దతు ధర, ఢిల్లిd శివార్లలో చనిపోయిన 702 మంది రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement