Thursday, April 25, 2024

ఢిల్లీ – డెహ్రాడూన్ కారిడార్‌.. రూ.18వేల కోట్లతో అభివృద్ధి పనులు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ అభివృద్ధికి గత ఐదేళ్లలో.. కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్టు ప్రధాని మోడీ తెలిపారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18,000 కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్టు వెల్లడించారు. మోడీ, శనివారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఢిల్లిd డెహ్రాడూన్‌ కారిడార్‌తో పాటు రూ.18,000 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. దేశ మంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం.. రూ.100 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
చిత్తశుద్ధితో పని చేయాలి

ఇందులో భాగంగా.. ఢిల్లీ-డెహ్రాడూన్‌ ఎకనామిక్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఢిల్లిd నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించడానికి పట్టే సమయం దాదాపు సగానికి తగ్గుతుందని వివరించారు. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదంటూ.. ప్రధాని మోడీ కాంగ్రెస్‌ను విమర్శించారు. అన్ని ప్రాంతాలను నిరుత్సాహపరిచారని, ముఖ్యంగా సైన్యాన్ని కూడా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌ విధానాలను అమలు చేశామన్నారు. సైన్యానికి ఆధునిక ఆయుధాలను అందించామని, ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇచ్చామని ప్రధాని తెలిపారు.

మౌలికవసతుల కల్పన
మన పర్వతాలు, సంస్కృతి మన విశ్వాసం మాత్రమే కాదు.. మన దేశ భద్రతకు కోటలు కూడా అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన సౌలభ్యానికి తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అయితే దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారు.. ఈ విధాన వ్యూహాన్ని అవలంబించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007-2014 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్ల విలువైన 288 కిలోమీటర్ల జాతీయ రహదారులను మాత్రమే నిర్మించిందని ప్రధాని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం 7 ఏళ్లలో ఉత్తరాఖండ్‌లో రూ.12,000 కోట్ల విలువైన 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ జాతీయ రహదారులను నిర్మించిందంటూ మోడీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement