Wednesday, May 1, 2024

లాలూప్రసాద్‌కు బెయిల్‌, పశుదాణా కుంభకోణం  కేసులో ఊరట

రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఝార్ఖండ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.139.35 కోట్ల పశుదాణా కుంభకోణంలోని దొరండా ట్రెజరీ కేసులో లాలూకు ఊరట లభించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఐదవ కేసులో ప్రస్తుతం బెయిల్‌ మంజూరైంది. మిగిలిన 4 కేసుల్లో ఇదివరకే లాలూకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో 30 నెలల జైలుశిక్ష విధించగా తన క్లయింట్‌ 42 నెలలు జైలులో ఉన్నారని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరామని లాలూ తరపు న్యాయవాది ప్రభాత్‌ కుమార్‌ తెలిపారు. బెయిల్‌ మంజూరు చేయవద్దన్న సీబీఐ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన చెప్పారు. పశుదాణా చెల్లింపుల పేరుతో వివిధ ట్రెజరీలనుంచి అక్రమంగా బిల్లులు వసూలు చేసిన కుంభకోణం మొత్తం విలువ రూ.960 కోట్లుగా సీబీఐ పేర్కొంది. లాలూపై ఐదు కేసులు దాఖలైనాయి. మొత్తంమీద 14 ఏళ్ల జైలుశిక్ష, రూ.60 లక్షల జరిమానా విధించారు. డుమ్కా, దేవ్‌గఢ్‌, ఛాయ్‌బస ట్రజరీల్లో మోసాలకు సంబంధించిన 4 కేసుల్లో ఇప్పటికే లాలూకు బెయిల్‌ లభించింది. ఇప్పుడూ తాజాగా దొరండా ట్రెజరీకి సంబంధించిన కేసులో ఊరట లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement