ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఆత్మహత్య
నీట్ కు ప్రిపేర్ అవుతున్న సుమిత్
చదువుల వత్తిడి తట్టుకోలేక బలవన్మరణం
కోటా – ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు. హర్యానా రోహ్తక్కు చెందిన 20ఏళ్ల విద్యార్ధి సుమిత్ నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. గత ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదివారం సాయంత్రం సుమిత్కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు హాస్టల్ వార్డెన్కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ ఏడాది తొమ్మిది మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇక గతేడాది ఏకంగా 30మంది విద్యార్దులు బలవన్మరణం చెందారు.