Monday, April 29, 2024

Delhi | నిలకడగా కిషన్ రెడ్డి ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఒక్కసారిగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటించింది. ఆస్పత్రి మీడియా సెల్ ఇంచార్జి ప్రొఫెసర్ డా. రీమా దాదా పేరటి విడుదల చేసిన ప్రకటనలో కిషన్ రెడ్డి కడుపులో అసౌకర్యం కారణంగా ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

ఆదివారం రాత్రి గం. 10.30 సమయంలో అస్వస్థతకు గురైన కిషన్ రెడ్డి హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరారు. తొలుత ఛాతిలో నొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు కథనాలు వచ్చాయి. అయితే కిషన్ రెడ్డి కార్యాలయ సిబ్బంది ఆ వార్తలను ఖండించారు. కడుపులో అసౌకర్యం కారణంగా చేరారని, పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదని వివరణ ఇచ్చారు. కార్డియాలజీ విభాగం ఎయిమ్స్‌లో వైద్య బృందం ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చారు. అదే విషయాన్ని సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన రూపంలో తెలియజేశారు.

- Advertisement -

నేతల పరామర్శలు

కిషన్ రెడ్డి ఆస్పత్రిపాలైన విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆదివారం రాత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కర్ణాటక నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుని కిషన్ రెడ్డిని పరామర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement