Wednesday, May 1, 2024

Vehicles | కియా కొత్త సెల్టోస్‌.. 2025 నాటికి మరో మూడు మోడళ్లు

కియా ఇండియా 2025 నాటికి మూడు కొత్త మోడళ్లను మార్కెట్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో రెండు విద్యుత్‌ కార్లు ఉంటాయని కంపెనీ తెలిపింది. 2030 నాటికి కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీ కార్ల వాటా 20 శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కంపెనీ తెలిపింది. కియా అత్యాధునిక ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేసిన సెల్టోస్‌ కారును కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కొత్త సెల్టోస్‌లో ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ పరంగా చాలా మార్పులు చేసింది.

జులై 14 నుంచి కొత్త సెల్టోస్‌ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. కొత్త కియా సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారు ఎక్స్‌లైన్‌, జీటీ లైన్‌, టెక్‌లైన్‌ పేరుతో మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. 8 రంగుల్లో ఇది లభిస్తుంది. కొత్తకారులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఎల్‌ఈడీ టర్న్‌ ఇండికేటర్స్‌ ఉన్నాయి. కియాకు దేశంలో 10 శాతం మార్కెట్‌ వాటాను సెల్టోస్‌ సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం కియా మొత్తం అమ్మకాల్లో సెల్టోస్‌ 55 శాతం వాటా కలిగి ఉంది.

- Advertisement -

భారత మార్కెట్‌ కోసం కంపెనీ ప్రత్యేక వ్యూహాలను కలిగి ఉందని తెలిపింది. భారత మార్కెట్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కంపెనీ ఇండియాలో 2025 నాటికి ఒక ఇంటర్ననల్‌ కంబుషన్‌ ఇంజిన్‌ (ఐఈసీ)తో ఒక కారు, రెండు విద్యుత్‌ కార్లను తీసుకు వస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ టెజిన్‌ పార్క్‌ తెలిపారు. 2030 నాటికి ఇండియాలో ఈవీ మార్కెట్‌ 20 శాతానికి చేరుతుందని ఆయన తెలిపారు.

అప్పటికి మార్కెట్‌లోసంవత్సరానికి 50 లక్షల వాహనాలకు చేరుకుంటాయని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ సంవత్సరానికి ప్రస్తుతం ఉన్న 3.5 లక్షల యూనిట్ల నుంచి 4.5 లక్షల యూనిట్లకు ఉత్పత్తిని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో 2028 నాటికి కంపెనీ అవుట్‌లెట్స్‌ సంఖ్యను 300 నుంచి 600కి పెంచనున్నట్లు తెలిపారు.కొత్త సెల్టోస్‌లో భద్రతా ఫీచర్లతో పాటు 17 అటానమస్‌ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement