Thursday, May 2, 2024

పెరిగిన సాంకేతిక‌త‌ని అందిపుచ్చుకున్న న్యాయ‌వ్య‌వ‌స్థ‌-గ్రామాల్లో కూడా డిజిట‌ల్ చెల్లింపులు-మోడీ

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం భీమ్..యూపీఐని ప్ర‌వేశ‌పెట్టినప్పుడు అవి చిన్న రంగానికే ప‌రిమితం అవుతుంద‌ని ప‌లువురు భావించార‌ని..కానీ నేడు గ్రామాల్లో కూడా డిజిట‌ల్ చెల్లింపులు జ‌రుగుతున్నాయ‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జ‌రుపుకుంటోంద‌ని, ఈ తరుణంలో న్యాయ వ్య‌వ‌స్థ పెరిగిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం అభినంద‌నీయం అన్నారు. శ‌నివారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన మొదటి అఖిల భారత జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశ ప్రారంభ సెషన్‌లో మోడీ మాట్లాడారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన పనిలో సాంకేతికతను అనుసరించే దిశలో వేగంగా ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు.

ఈ-కోర్టుల మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులు ప్రారంభమవుతున్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కోర్టులు ఇప్పటివరకు 1 కోటి కంటే ఎక్కువ కేసులను విచారించాయని, హైకోర్టులు, సుప్రీంకోర్టులో సుమారు 60 లక్షల కేసులు విచారించాయని తన‌కు చెప్పార‌ని తెలిపారు. కరోనా సీజన్ లో ఇది ఒక ప్ర‌త్యామ్నాయంగా మారింది. కానీ ఇప్పుడ‌ది వ్య‌వ‌స్థ‌లో ఒక భాగంగా మారింది. మన న్యాయవ్యవస్థ ప్రాచీన భారతీయ న్యాయ విలువలకు కట్టుబడి ఉందని, అదే సమయంలో 21వ శతాబ్దపు వాస్తవాలతో సరిపోలడానికి సిద్ధంగా ఉందని ఇది రుజువ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement