Monday, April 29, 2024

Awards For Telangana | యాదాద్రి సహా 5 భవనాలకు అంతర్జాతీయ అవార్డులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ వైకుంఠంగా ఖ్యాతి గడించిన యాదాద్రి లక్ష్మీనరహింహస్వామి క్షేత్రం సహా తెలంగాణాలోని ఐదు ప్రతిష్టాత్మక నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఈ విశిష్ట కట్టడాలు ”ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌’ అవార్డులకు ఎంపికైనట్లు లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించింది. అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి మహా దివ్యక్షేత్రం, దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్‌ బ్రిడ్జి, ప్రతిష్టాత్మక డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూం, నిజాం కాలం నాటి మొజాంజాహీ మార్కెట్‌ సముదాయాలు ఉన్నాయి.

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు దక్కడం విశేషం. ఈ నెల 16న లండన్‌లో ‘గ్రీన్‌ ఆర్గనైజేషన్‌’ ఈ అవార్డులను అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అవార్డులను అందుకోనున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్దరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇందులో, డా.బిఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జీ, మొజం జాహీ మార్కెట్‌లు ఉండడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ‘ఇంటర్నేషనల్‌ బ్యూటీ-ఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డుల’ను అందుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌ కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్‌ ఆర్గనైజేషన్‌’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్‌ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు- దేశ ఖ్యాతి ఇనుమడించిందని తెలిపారు. అభివృద్ధిలో రాజీలేని పోరాటం నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్దరణ జరుగుతున్నదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అందుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతి దారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16 న లండన్‌లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రాన్రికి అందచేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం కేసీఆర్‌ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement