Saturday, April 27, 2024

ధార్మిక క్షేత్రాల్లో జోక్యం తగదు.. అహోబిలం మఠం కేసులో సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అహోబిలం మఠం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అహోబిలం మఠం సాధారణ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని, మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మఠం ఈవో నియామకాన్ని తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకా తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జరిపింది. ఈ సందర్భంగా ఆలయాలు, ధార్మిక క్షేత్రాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఆలయాలను ధర్మకర్తలకే వదిలేయాలని సూచించింది. అహోబిలం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు  తోసిపుచ్చింది. మఠంలో ఈవో నియామకాన్ని తప్పుబడుతూ గతంలో హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడా నిరాశే ఎదురైంది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కర్నూలులోని అహోబిలం ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి ‘ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (ఈవో)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26(డి)ని ఉల్లంఘించడమేనని హైకోర్టు ఇదివరకు తీర్పునిచ్చింది. తమిళనాడులో ఉన్న అహోబిలం మఠంలో ఈ ఆలయం అంతర్భాగమని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. దేవాలయం, మఠం వేర్వేరు సంస్థలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన వాదనను హైకోర్టు తిరస్కరించింది. మఠం, ఆలయం వేర్వేరు భౌగోళిక ప్రదేశాలలో ఉన్నాయని, ఒకటి తమిళనాడులో మరొకటి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నందున, ఆలయం, మఠంలో భాగం కాదన్న వాదనను సమర్థించలేదమని కోర్టు తెలిపింది. చారిత్రాత్మక పుస్తకాలు, సాహిత్యం పురావస్తు డేటాను ప్రస్తావించిన కోర్టు… దేవాలయం, మఠాన్ని మఠాధిపతులు నిర్వహిస్తున్నారని పేర్కొంది.

- Advertisement -

మఠం నిర్వహణ సాధారణ అధికారం రాష్ట్రానికి ఇస్తున్నామని, దాని వ్యవహారాల్లో తక్కువగా జోక్యం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అధికార దుర్వినియోగం సరికాదని తెలిపింది. ఆలయానికి ఈవోను నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 1927 ఎండోమెంట్స్ చట్టం ప్రకారం, ఆలయం మఠాధిపతుల నిర్వహణలో ఉందని, వీరి నామినేషన్ ప్రభుత్వానికి సంబంధం లేదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.  ఏపీ ధార్మిక, హిందూ మతపరమైన సంస్థల్లో దేవాదాయ చట్టం ప్రకారం మఠం లేదా ఆలయానికి కార్యనిర్వాహక అధికారిని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో పేర్కొంది. ఆలయానికి వంశపారంపర్యంగా కాని ధర్మకర్తలను నియమించే పద్ధతి లేదని 2014లో రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించిందని తెలిపింది.

ఇదే అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ జోక్యం మఠాధిపతి పరిపాలనా హక్కును ప్రభావితం చేసేలా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాదులు సతీష్ ప్రసరన్, సి.శ్రీధరన్, న్యాయవాది విపిన్ నాయర్ భక్తుల తరఫున కేవియట్‌ పిటిషన్ ద్వారా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement