Friday, April 26, 2024

రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ట్రైన్లను పట్టాలెక్కించగా.. ఈ నెల 21 నుంచి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి వస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 25 నుంచి యూపీ గోరఖ్‌పూర్‌ నుంచి మహారాష్ట్రలోని బాంద్రా టెర్మినస్ వరకు కొత్తగా సమ్మర్‌ స్పెషల్‌ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. సోమవారం నుంచి 50 ప్రత్యేక రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. జూన్‌ ఒకటో తేదీ నుంచి 18 మధ్య అదనంగా 660 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. గత శుక్రవారం నాటికి 983 ప్యాసింజర్‌, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి వచ్చాయి.

అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్లు
కరోనా తగ్గుముఖం పడుతుండడంతో డిమాండ్‌ మేరకు రైల్వేశాఖ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. పునరుద్ధరిస్తున్న రైళ్లలో న్యూఢిల్లీ-కల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ-అమృత్‌సర్‌ జంక్షన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ జంక్షన్‌-కోట్వారా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, చండీగఢ్‌-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, ఢిల్లీ సారాయ్‌ రోహిల్లా-జమ్ముతావి దురంతో, శ్రీమాతా వైష్ణోదేవి కత్రా-న్యూఢిల్లీ శ్రీ శక్తి, కల్కా-సిమ్లా ఎక్స్‌ప్రెస్‌, బిలాస్‌పూర్‌ జంక్షన్‌-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌, జమ్ముతావి-యోగానగరి రిషికేశ్‌ ఎక్స్‌ప్రెస్‌, లక్నో-ప్రయాగ్‌రాజ్‌ సంగం ఎక్స్‌ప్రెస్‌, ఛప్రా-లక్నో జంక్షన్ మధ్య ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడువనున్నాయి.

ప్లాట్ ఫాం టికెట్‌తోనే ప్రయాణం
ప్లాట్‌ఫామ్‌ టికెట్‌తోనే ఇక రైలులో ప్రయాణించేందుకు ప్యాసింజర్లకు భారతీయ రైల్వే ఇటీవల అవకాశం కల్పించింది. గమ్యస్థానానికి టికెట్‌ ధర ఎంతో అంత ధరను మాత్రం ప్రయాణంలో చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా జారీచేసిన నిబంధనల మేరకు.. ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ) దగ్గరకు వెళ్లి తమకు ఎక్కడికి టికెట్‌ చెబితే.. టీటీఈ టికెట్‌ జారీ చేస్తారు. టికెట్ల కోసం క్యూలో నిల్చోడం.. రైలు బయలుదేరే సమయంలో వచ్చి టికెట్‌ కొనుగోలు చేయలేకపోయిన వారికి విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వేశాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement