Thursday, April 25, 2024

దారుణం.. భార్య ప్రాణం తీసిన సలాడ్

భోజనంలో సలాడ్‌ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్యపై దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్‌ జలాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే… మురళి (45), సుదేశ్‌ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్‌ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్‌ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్‌ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్‌, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement