Thursday, May 2, 2024

పరస్పర ‘లబ్ధి’ – అసైన్డ్‌ భూముల్లో వెంచర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పట్టణాలు, నగరాలు, విలువైన ప్రాంతాలు, జాతీయ రహదారులకు సమీపంలోని అసైన్డ్‌ భూములపై సర్కార్‌ కన్నేసింది. విలువైన భూములతో రియల్‌ వ్యాపారం చేసేందుకు వెంచర్లుగా అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సాగుకు యోగ్యంగా లేని భూములతో ఇటు ప్రభుత్వం అటు అసైనీలు లబ్ది పొందేలా ప్లాన్‌ వేస్తోంది. ప్లాట్లు, ఇండ్ల స్థలాలకు డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను అసైన్‌ లబ్దిదారుల అంగీకారంతో సమీకరించి వాటిని ప్లాట్లుగా అభివృద్ధిపర్చి వెంచర్‌లగా వేసి మౌలిక సదుపాయాలు కల్పించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది. వెంచర్లుగా అభివృద్ధిపర్చిన భూమిలోనుంచి విస్తీర్ణాన్ని ఆధారంగా అసైనీకి ప్లాట్లను కేటాయిస్తారు. అసైనీనుంచి ఎకరం స్థలం సేకరిస్తే కనీసర్గా 200 చదరపు గజాల స్థలాన్ని అసైనీకి పట్టా చేయాలని భావిస్తున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసైనీల డిమాండ్‌కు అనుగుణంగా కొంత ఎక్కువ స్థలం ఇవ్వాలని, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో 600 చదరపు గజాలు కూడా ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తోంది.

ఎకరాకు 4840 చదరపు అడుగులలో 50శాతం రహదారులు, పార్కులు, ఇతర సౌకర్యాలకు పోనున్నది. ఇక మిగిలిన 2420 చదరపు గజాల్లో అసైనీ హక్కులు కోల్పోయిన రైతులకు గరిష్టంగా 600 చదరపు గజాలు ఇచ్చినా 1820 చదరపు గజాలపై ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే ఖజానాకు భారీ రాబడి సమకూరనున్నది. పట్టణీకరణ, వేగంగా అర్భనైజేషన్‌, పెరుగుతున్న ప్లాట్ల ధరలు, అందుబాటులోలేని వసతుల కారణంగా ఇండ్లు కట్టుకునేవారికి డిమాండ్‌ పెరుగుతోంది. ఉద్యోగులు, వివిధస్థాయిల్లో స్థాయిల్లోనివాళ్లు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ప్రభుత్వ వెంచర్లకు మంచి డిమాండ్‌ ఉంది. సత్వర అనుమతులు, సకల వసతులు, యాజమాన్య హక్కుల కల్పనలో ఎటువంటి మోసాలు లేకపోవడంవంటి వాటితో ప్రజలు ప్రభుత్వ వెంచర్లవైపు మొగ్కగు చూపిస్తున్నారు.
పాగుభూమిలేని నిరుపేదలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గతంలో ప్రభుత్వాలు దశలవారీగా ప్రభుత్వ భూములను అసైన్‌ చేశాయి. ఈ భూముల్లో మెజార్టీ భూములు సాగుకు యోగ్యంలేనివే ఉన్నాయి.

- Advertisement -

రాళ్లు, గుట్టలు, నీటివసతిలేని భూములు ఉండటంతో సాగు చేయకుండా పడావుగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను విక్రయించేందుకు వీలులేదు. ఈ నేపథ్యంలో ఇలా 24లక్షల ఎకరాల్లో దాదాపు 50శాతం భూములను అభివృద్ధిపర్చి ప్రజలకు, అసైనీలకు లబ్ది చేకూర్చితే ఎలా ఉంటుందని ప్రభుత్వం పరిశీలన చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 44వ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల్లోని అసైన్డ్‌ భూములను ఇలా పరిశీలించినట్లు తెలిసింది. భూత్పూర్‌ మండల కేంద్రంలో 202 ఎకరాలు, జడ్చర్ల మండంలో 36ఎకరాలు, మరోచోట 77 ఎకరాలు, నందిగామలో 50 ఎకరాలు, వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపూర్‌లో 65ఎకరాలను, పెబ్బేరులో 44 ఎకరాలు, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యంకాని పట్టా భూములు 100 ఎకరాలు ఉన్నాయని గుర్తించారు. అసైన్డ్‌ భూముల సేకరణను ఖమ్మం రైతులు వ్యతిరేకించారు. సత్తుపల్లి, వైరా, కొణిజర్ల, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో తొలివిడతలో 842 ఎకరాలను గుర్తించగా, సేకరించిన భూమిలో 80శాతం సాగుదారులకే పట్టా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

రంగరెడ్డి జిల్లా శ్కర్‌పల్లి, మోకిలాలో 600ఎకరాలు షాబాద్‌ మండలంలో 144 ఎకరాలు, మల్లాపూర్‌లో 42 ఎకరాలు, బోడుప్పల్‌లో 70 ఎకరాలను, నల్గొండ శివారులో 60 ఎకరాలుయాదాద్రి జిల్లా తుర్కపల్లిలో 110 ఎకరాలు, నిర్మల్‌ జిల్లాలోని మూడు మండలాల్లో 144 ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో 300 ఎకరాలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 100ఎకరాలను గుర్తించారు. అసైన్డ్‌ భూములపై దృష్టిసారించిన సర్కార్‌ నిరుపేదలకు హక్కుల విషయంలో పునరాలోచన చేస్తోంది. తెలంగాణ అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేద చట్టం -1977కు సవరణలు చేస్తేనే ఏదైనా చేసేందుకు వీలు కానున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎకరా రూ. 40లక్షలకు తగ్గడంలేదు. ఇటువంటి తరుణంలో పట్టణాల్లోని భూములకు హక్కులు కల్పిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే వీటిని నమ్ముకున్న పేదలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు పూలింగ్‌ విధానమే బెటర్‌ అని అంటున్నారు. అసైన్డ్‌ చేసిన భూముల్లో 40శాతం భూములు అసైనీల చేతుల్లో లేవని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. రాష్ట్రంలో 15 లక్షలమందికి 24 లక్షల ఎకరాలను అసైన్డ్‌ చేశారు. వీటిలో సింహభాగం ఆక్రమణలు, విక్రయాలకు గురయ్యాయని ప్రభుత్వం గుర్తించింది. భూముల ధరలు పెరగడం, వాటి పరిరక్షణ కష్టమైన నేపథ్యంతోపాటు, సాగు యోగ్యతలేని కారణంగా పరస్పర లబ్దితో పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement