Thursday, May 2, 2024

క్యాబ్​ అగ్రిగేటర్లకు హైకోర్టు హెచ్చరిక.. ఈ నెల 16లోగా లైసెన్స్​ పొందాలని ఆదేశాలు

ఓలా, ఉబర్ తో పాటు ఇలాంటి అగ్రిగేటర్లు తమ కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటే మార్చి 16లోగా చెల్లుబాటయ్యే లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకోవాలని బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఇంకా లైసెన్సులు పొందని అగ్రిగేటర్లను నిరోధించడం వల్ల సేవలు పొందే ప్రయాణికులకు హాని కలుగుతుందని మాకు తెలుసు అని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినయ్ జోషి అన్నారు. అలాంటి క్యాబ్‌లను నియంత్రించేందుకు ఉద్దేశించిన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. అయితే, మహారాష్ట్రలోని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ నిబంధనలను రూపొందించలేదు. రాష్ట్రంలోని వారు మహారాష్ట్ర సిటీ టాక్సీ రూల్స్ 2017 ప్రకారం వారికి ఇచ్చిన అనుమతుల ఆధారంగా పనిచేస్తున్నారని కోర్టు గమనించింది. ‘‘మీరు (అగ్రిగేటర్లు) ఏమి చేస్తున్నారు? ఇది పూర్తి చట్టవిరుద్ధం. మీరు చట్టాన్ని పాటించడం లేదు. చట్టం చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనలు లేనంత కాలం మీరు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది”అని ధర్మాసనం స్పష్టం చేసింది.  ఆమోదం పెండింగ్‌లో ఉన్న మహారాష్ట్ర రెగ్యులేషన్ ఆఫ్ అగ్రిగేటర్ రూల్స్, 2021 అమల్లోకి వచ్చే వరకు కేంద్రం నిబంధనలు వర్తిస్తాయని బెంచ్ ఆదేశించింది.

2020 నుండి కేంద్ర మార్గదర్శకాలు అమలులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను పాటించకుండా మహారాష్ట్రలో అగ్రిగేటర్లను పనిచేయడానికి అనుమతించడం బాధ కలిగించిందని ఈ ఉత్తర్వును నిర్దేశిస్తూ ధర్మాసనం పేర్కొంది. ప్రాంతీయ రవాణా అధికారులకు (RTA) లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అగ్రిగేటర్లకు బెంచ్ ఏడు రోజులు, రాష్ట్రం పరిగణనలోకి తీసుకోవడానికి మరో 10 రోజుల గడువు ఇచ్చింది. ఆర్టీఏలు తమ దరఖాస్తును తిరస్కరిస్తే స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని అగ్రిగేటర్లను కోరింది. ఈ కేసును కోర్టు మార్చి 28న తదుపరి విచారించనుంది.

విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి దత్తా వ్యక్తిగత అనుభవాన్ని కూడా వివరించారు. “ఓలా మరియు ఉబర్ డ్రైవర్లు ఎక్కువ గంటలు డ్రైవ్ చేస్తారని నా కొడుకు చెప్పాడు. నా కొడుకు ఫొటో తీసి నాకు పంపాడు. నోయిడా ఎక్స్ ప్రెస్‌వే వెంబడి క్యాబ్ ల ఫొటో తీసుకున్నాడు. ఎందుకంటే డ్రైవర్ నిద్రపోతున్నాడు. వరుసగా 24 గంటలు నడపడం అంటే చాలా కష్టం” అని అగ్రిగేటర్‌లతో డ్రైవర్ల పని, పరిస్థితులను వివరిస్తూ చీఫ్ జస్టిస్ దత్తా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement