Friday, May 10, 2024

న్యాయ‌వాదుల హ‌త్య – సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు

హైద‌రాబాద్ : న‌్యాయ‌వాదులైన గ‌ట్టు వామ‌న్‌రావు, పీవీ నాగ‌మ‌ణి దంప‌తుల హ‌త్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. ఈ హ‌త్య‌కు సంబంధించిన అన్ని ఆధారాలు ప‌క‌డ్బందీగా సేక‌రించాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌ను హైకోర్టు ఆదేశించింది. న‌్యాయ‌వాది వామ‌న్‌రావు, ఆయ‌న స‌తీమ‌ణి నాగ‌మ‌ణి హ‌త్య‌తో షాక్‌కు గుర‌య్యామ‌ని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీ అన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ లోపు స‌మ‌గ్ర‌మైన నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఏజీని ఆదేశించిన హైకోర్టు.. ప్ర‌భుత్వానికి, పోలీసు శాఖ‌కు నోటీసులు జారీ చేసింది. హ‌త్య జ‌రిగిన చోట అన్ని ఆధారాల‌ను సేక‌రించి, కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుపాల‌ని ఆదేశించింది. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డున్న ఆర్టీసీ బ‌స్సుల్లోని ప్ర‌యాణికుల‌ను గుర్తించి వాళ్ల‌ను సాక్షులుగా చేర్చాల‌ని కోర్టు తెలిపింది. హ‌త్యకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయ‌ని, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మార్చి 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. న్యాయ‌వాదులైన వామ‌న్‌రావు, నాగ‌మ‌ణి హ‌త్య జ‌రిగిన వెంట‌నే పోలీసు శాఖ అప్ర‌మ‌త్త‌మైంద‌ని కోర్టుకు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తెలిపారు. హంత‌కుల‌ను అతి త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌ని ఆయ‌న కోర్టుకు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement