Monday, April 29, 2024

ఓవర్‌ లోడ్​ కర్ర లారీలకు భారీ ఫైన్​.. తీరు మారకపోతే కేసులు తప్పవన్న డీసీపీ

ఓవర్‌ లోడ్‌ కర్ర లారీలపై పోలీసులు కఠినచర్యలు ప్రారంభించారు. ప్రమాదకరంగా కర్రలు తీసుకెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో భారీ జరిమానాలు విధించారు. శనివారం బసంత నగర్ టోల్ ప్లాజా వద్ద సబాబుల్‌ కర్రలతో ప్రమాదకరంగా వెళ్తున్న 20 లారీలను నిలిపివేయించి రవాణా శాఖ అధికారులతో భారీగా జరిమానాలు వేయించారు. ఈసందర్భంగా పెద్దపల్లి డీసీపీ అఖిల్‌ మహజన్‌ మాట్లాడుతూ లారీలు ఓవర్‌ లోడ్‌, అతి వేగంగా వెళ్లడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. లారీకి బయటకు వచ్చేలా కర్రలు ఉంటే విద్యుత్‌ తీగలకు తగిలి షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఓవర్‌ లోడ్‌తో డ్రైవర్స్‌కి లారీ బ్యాలెన్స్‌ చేయడం కూడా కష్టతరమవుతుందన్నారు.

ఇలాంటి లారీలు రోడ్లపై నిలిచిపోయిన సమయంలో ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఓవర్‌ లోడ్‌తో వెళ్లిన లారీలను సీజ్‌ చేయడంతోపాటు- చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా తీరు మారకపోతే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, అనిల్‌కుమార్‌, ఎంవీఐ రవికుమార్‌, ఎస్‌ఐలు మహేందర్‌, శివానీ, నాగరాజుతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement