Tuesday, April 30, 2024

Air pollution | తెలంగాణ‌లో గాలి క‌ర‌వు… క్షీణిస్తున్న ఉష్ణోగ్ర‌త‌ల‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు

వాతావరణంలో మారుతున్న పరిస్థితులతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఓ వైపు పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు కారణమైతే, మరోవైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలు కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణలో రాష్ట్రంలో చలి క్ర‌మ‌ క్రమంగా పెరుగుతొంది.. దీంతో గాలి నాణ్యత కూడా క్షీణిస్తోంది. ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతల సమయాల్లో గాలి నాణ్యత మధ్యస్థ స్థాయికి పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

గాలి కాలుష్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక‌, ఆస్తమా, సీఓపీడీ వంటి సమస్యలున్న వారు చలి గాలి ప్రభావానికి గురి కాకుండా జాగ్రత్తపడాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. బయటకు వెళ్లేటప్పుడు ఎన్ – 95 మాస్క్ వాడాలి. మార్నింగ్ వాకింగ్ వెళ్లే వారు ఎండ వచ్చాక బయటకు వెళ్లడం మంచిది. దీర్ఘకాలిక జబ్బులు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, పరిశ్రమలు, వాహనాలు, చెత్తను కాల్చడం ద్వారా… పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు), పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళికణాలు), ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి పలు కాలుష్య కారకాలు గాలిలోకి ఎక్కువగా విడుదలవుతుంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఆయా ధూళికణాలు చెల్లాచెదురవుతాయి. చలికాలంలో గాలిలో కదలికలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల ఎక్కువ సేపు తక్కువ ఎత్తులో ఒకేచోట ఉండిపోతాయి. ఇక‌, గాలి పీల్చినప్పుడు ముక్కులోంచి నేరుగా లంగ్స్ లోకి ప్రవేశిస్తాయి.. దీంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

- Advertisement -

తెలంగాణ‌లో పెరుగుతున్న చలి..

మరోవైపు, తెలంగాణలో జనవరి రాక ముందే చలి వణికిస్తోంది. వారం క్రితం వరకూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, క్రమంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఈశాన్యం నుంచి తెలంగాణ వైపు చలిగాలులు వీస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, రాత్రి పూట చలి తీవ్రత పెరుగుతోందని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement