Thursday, May 23, 2024

Floods | 33.4 అడుగులకు గోదావరి నీటిమట్టం.. అంత‌కంత‌కూ పెరుగుతున్న వ‌ర‌ద‌

భద్రాచలం, ప్రభన్యూస్‌ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.4 అడుగులకు చేరుకుంది. తాలిపేరు ప్రాజెక్టు ఎగువ నుంచి వరద నీరు గోదావరికి చేరుతోంది. కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వలన బుధవారం రాత్రికి భద్రాచలం వద్ద 35 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరే అవకాశం ఉందని కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 2.35 లక్షల క్యూసెక్కులు, ఇంద్రావతి నది నుండి 2.15 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదిలారని, తాలిపేరు ప్రాజెక్టు నుండి 60 వేల క్యూసెక్కుల నీటిని వదలనున్నారని, ఈ కారణం చేత భద్రాచలం వద్ద అర్థరాత్రి సమయానికి 35 అడుగులకు చేరే అవకాశం ఉందని ఆమె అన్నారు.

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950, వాట్సాప్‌ నెం.9392919743, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలోని -9392919750, భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో – 08743-232444 నెంబర్‌లకు రోజులోని 24గంటల్లో ఎప్పుడైనా ప్రజలు సంప్రదించవచ్చని ఆమె తెలిపారు. లైఫ్‌ జాకెట్లు, గజ ఈతగాళ్ళు, నాటు పడవలు సిద్ధంగా ఉన్నాయని, అత్యవసర సేవలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం అందుబాటులో ఉందని, వారి సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. పశువులను బయటకు పంపరాదని, ఇంటి వద్దనే ఉంచి మేతను అందించాలని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement