Wednesday, May 1, 2024

Siddipet: ఆఖరి ప్రయాణానికి వరద ముప్పు.. ప్రవాహంలోంచే పాడె తరలింపు

చేర్యాల: వాగుపై బ్రిడ్జి నిర్మాణం చెప్పట్టకపోవడంతో మరణించిన వ్యక్తిని వైకుంఠ దామానికి వాగులో నుండి తీసుకెళ్లిన హృదయవిధారక ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన బసవరాజు బాలయ్య (75) మరణించారు. మరణించిన వ్యక్తిని దహన సంస్కారాలు చేయడానికి వైకుంఠ దామానికి తీసుకెళ్లాలి. కానీ గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని వాగు నిండుకుండలా మారి పూర్తిస్థాయిలో ప్రవహిస్తుంది.

గ్రామ శివారులో ఉన్న వైకుంఠ దామానికి శవాన్ని దహన సంస్కారాలకు తీసుకెళ్లడానికి చెరువుపై బ్రిడ్జి నిర్మాణంలేక వాగులో నుండి శవాన్ని గ్రామ శివారుకు తీసుకెళ్లడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీసుకొని వెళ్లారు కుటుంబ సభ్యులు. అలాగే సాధారణ సమయాల్లో కూడా గ్రామం నుండి చేర్యాల మండల కేంద్రానికి గ్రామ ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. కానీ వర్షాకాలం వచ్చిందంటే వాగు అలుగుపారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ చూపి గ్రామంలో వాగుపై బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసి గ్రామపజల ఇబ్బందులు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement