న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తప్ప వరద బాధితులందరికీ సహాయం అందజేస్తున్నామని ఏలూరు ఎంపి కోటగిరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్సులో సహచర ఎంపీలు తలారి రంగయ్య, గొడ్డేటి మాధవి, రెడ్డప్పతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వరదలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. అమరావతికి, ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అవసరం లేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నామని అన్నారు.
గోదావరి నదికి సంభవించిన వరదల కారణంగా నష్టపోయినవారికి, ఇబ్బందులు పడుతున్నవారికి నిత్యాసర వస్తువుల కోసం తక్షణం రూ. 2,000 అందజేస్తున్నామని తెలిపారు. అలాగే వరదల్లో పూర్తిగా ఇళ్లు కోల్పోయినవారికి రూ. 10 వేలు, పాక్షికంగా దెబ్బతిన్నవారికి రూ. 5 వేల ఆర్థిక సహాయం రెండ్రోజుల్లో అందజేస్తామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో ఏలేరుపాడుకు వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. 2029, 2034 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని, అప్పటి వరకు కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డే ఉంటారని కోటగిరి శ్రీధర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.