Friday, May 17, 2024

ఆహార భద్రతా చట్టం అమల్లో ఏపీ భేష్.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఆహార భద్రతా చట్టం అమలులో ఉత్తమ పనితీరుతో ఒడిషా, ఉత్తర ప్రదేశ్ ప్రధమ, ద్వితీయ స్థానాలు ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు, పౌర సరఫరాల వ్యవస్థ పని తీరు ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించడం జరిగినట్లు ఆమె చెప్పారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార భద్రతా చట్టం అమలు, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (టీపీడీఎస్) కార్యకలాపాల ఆధారంగా ఆయా రాష్ట్రాల ర్యాంకులను నిర్ధారించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ర్యాంకుల నిర్ధారణ కోసం ప్రధానంగా మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. తొలి అంశం కింద ఆహార భద్రతా చట్టం కింద అసలైన లబ్దిదారుల గుర్తింపు, వారికి ఆహారం పంపిణీ జరిగే తీరు. రెండో అంశం కింద ఆహార ధాన్యాల రవాణా, వాటిని పంపిణీ కోసం రేషన్‌ దుకాణాల కోసం చేర వేసే పటిష్టమైన వ్యవస్థ, మూడోది పోషకాహారం పంపిణీ కోసం పౌరసరఫరాల శాఖ చేపట్టే కార్యక్రమాలు. ఈ మూడు అంశాల ఆధారంగానే రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. అత్యుత్తమ ర్యాంకుల సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement