Sunday, April 28, 2024

Delhi | వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం… ఎంపీల ప్రశ్నలకు కిషన్‌రెడ్డి బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి (వైఎస్సార్సీపీ), హేమ మాలిని (బీజేపీ), మన్నె శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) అడిగిన ప్రశ్నలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 60 ఏళ్లు దాటి వార్షిక ఆదాయం రూ. 48 వేల లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

వివిధ కళల్లో విశేష సేవలందించిన కళాకారులు ఈ పథకం కింద సహాయం పొందుతున్నారని, నెలకు 6 వేల రూపాయల చొప్పున కళాకారులకు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఐదేళ్లకోసారి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, ప్రతిఏటా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కూడా అందజేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి జవాబులో పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎలాంటి జాప్యం లేకుండా నిధులు అందజేస్తున్నామని వెల్లడించారు. 2020-21లో ఈ పథకం కోసం రూ. 8.71 కోట్లు ఖర్చు చేశామని, 2022-23లో ఆ మొత్తం 18.59 కోట్లకు చేరుకుందని జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement