Monday, May 13, 2024

16 నుంచి ఐదో విడత గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. ప్రారంభించనున్న సద్గురు జగ్గీ వాసుదేవ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపే లక్ష్యంగా సాగుతోన్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఐదో విడత కార్యక్రమం ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ రోడ్‌ గొల్లూరు అర్బన్‌ ఫారెస్టు పార్కులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ 5.0ను ప్రారంభించనున్నారు. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్‌ సాయిల్‌ ఉద్యమంతో సద్గురు ప్రపంచ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈనెల 15న హైదరాబాద్‌కు చేరుకుని, 16న కర్నూలు మీదుగా బెంగుళూరు వెళ్ళనుంది. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఐదేళ్ళ కిందట చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి తెలుసుకున్న సద్గురు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుముఖత తెలిపారు. దీనిలో భాగంగా 16వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సద్గురు గొల్లూరు చేరుకుని సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటి, ఐదో విడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలను నాటనున్నారు. అలాగే ఈ కార్యక్రమం కోసం తరలివచ్చే ప్రముఖులు, గ్రీన్‌ ఇండియా ప్రేమికులు ఇదే అటవీ ప్రాంతం వేదికగా ఒకేసారి పది వేల మొక్కలను నాటనున్నారు. క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుజ్జీవనం చేయడంలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ ఈ కార్యక్ర్రమాన్ని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌తో కలిసి నిర్వహిస్తోంది.

సీఎం కేసీఆర్‌ రూపొందించిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో 2018లో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించారు. ఒకరు మూడు మొక్కలను నాటి , మరో ముగ్గుర్ని మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్‌ విసరటమే గ్రీన్‌ ఇండియా కార్యక్రమం స్ఫూర్తి. ప్రారంభించిన అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి హరిత స్ఫూర్తిని నింపింది. అసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌ నుంచి అస్సాం దాకా నలుదిక్కులా మొక్కలు నాటడం, పచ్చదనం పెంచడం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. గత నాలుగేళ్ళలో గిన్నిస్‌ రికార్డులతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టి లాంటి వినూత్న కార్యక్రమాలతో కోట్లాది మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. అటవీ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. పుట్టిన రోజుతో పాటు ఏ ఇంట ఏలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండుగ చేసుకోవం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ ఐదో విడతలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను మరింత విస్తరించేందుకు దేశ వ్యాప్తంగా విభిన్న వర్గాలను భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement