Thursday, May 2, 2024

బీఆర్ఎస్‌లో రైతులే నేతలు.. గుజరాత్ మోడల్‌తో బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది : గుర్నామ్ సింగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితిలో రైతులే నేతలుగా ఉంటారని, వారే గెలిచి రైతు అనుకూల చట్టాలు చేస్తారని ఆ పార్టీ రైతు విభాగం భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయాధ్యక్షులు గుర్నామ్ సింగ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దేశంలో ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పేదలు, రైతులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు లేవని కానీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, కార్మికులకు,పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందని అన్నారు. తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాలు యావత్ దేశానికి అందజేయాలని కేసీఆర్ భావిస్తున్నారని వెల్లడించారు.

6 రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హర్యానా, పంజాబ్, బీహార్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రపై దృష్టి సారించామని తెలిపారు. రైతులు రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని, రైతుల నుంచి బీఆర్ఎస్ పట్ల విశేష స్పందన కనిపిస్తోందని గుర్నామ్ సింగ్ అన్నారు. దేశంలో ప్రతిమూలకు భారత రాష్ట్ర కిసాన్ సమితిని తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు. త్వరలో బీఆర్ఎస్ విధానాలను కేసీఆర్ ప్రకటిస్తారని తెలిపారు.

- Advertisement -

గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని మోడీ దేశాన్ని అమ్మేశారని దుయ్యబట్టారు. పంట భూములు, రైళ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు.. ఇలా వేటినీ వదలకుండా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, పేదల పక్షాన ఉందని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ఫలాలు దేశ ప్రజలందరికీ అందజేస్తామని తెలిపారు. రైతు బంధు దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘కిసాన్ సమ్మన్ నిధి’ అందరికీ అందడంలేదని ఆరోపించారు. మిగతా పార్టీలు అధికారం కోసం, డబ్బు కోసం పనిచేస్తున్నాయని.. బీఆర్ఎస్ వాటన్నింటికీ భిన్నంగా రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని, అందుకే తాను ఆ పార్టీలో చేరానని గుర్నామ్ సింగ్ వ్యాఖ్యానించారు.

దేశాన్ని మార్చేందుకు కేసీఆర్ దగ్గర అనేక ప్రణాళికలున్నాయని, త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేయవచ్చని, కానీ ఇవ్వడం లేదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతు ఆందోళనలే ఉండవని గుర్నామ్ సింగ్ అన్నారు. తెలంగాణలో 8 ఏళ్లలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement