Thursday, April 25, 2024

సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : సీపీఆర్ పై ప్ర‌తి ఒక్క‌రికీ అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఖమ్మం సమీకృత కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గా మారి డాక్టర్లకు సైతం తెలియని అంశాలు తెలియపరచి అభినందనలు అందుకున్నారు. స్వయంగా తన చేతులతో సీపీఆర్ చేసి సీపీఆర్ విధానంలో మెలకువలను వివరించారు. మారిన జీవన విధానం, పెరిగిన ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో అత్యవసర సమయాల్లో చేపట్టే సీపీఆర్‌ పై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఖమ్మం నూతన కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. హాజరైన అధికారులు, సర్పంచులు వైద్యులు, సిబ్బందికి సీపీఆర్ చేసే విధానాన్ని మంత్రి సారధ్యంలో వైద్యులు చేసి చూపించారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మారిన ఆహార అలవాట్లు, జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో వయసుతో సంబంధం లేకుండా పెరిగినప్రధానంగా, చిన్నా పెద్ద తేడా లేకుండా గుండె పోటుతో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారన్నారు.అలాంటి సమయంలో వారిని కాపాడేందుకు ఒకే ఒక్క పరిష్కారం సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రీససిటేషన్‌) ఎంతో ప్రయోజనకరం అని, ఈ పద్ధతిని అనుసరించి గుండె లయను సాధారణ స్థాయికి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.

ఛాతి ఎడమ భాగంపై చేతులతో ఒత్తిడి పెంచి కృత్రిమ శ్వాస అందించడం ద్వారా ప్రాణం పోసే అవకాశం ఉండడంతో ఈ విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకోసం జిల్లాలో విడతల వారీగా వైద్య అరోగ్య శాఖ ఆధ్వర్యంలో అత్యవసర విభాగాలైన మెడికల్‌, పోలీస్‌, మున్సిపల్‌, శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి, ఆ తర్వాత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఉరుకులు, పరుగుల జీవనం.. మారుతున్న ఆహారం, పరిస్థితుల కారణంగా అనేక మంది గుండెపోటుకు గురవుతున్నారని, వయస్సుతో సంబంధం లేకుండా సడెన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారని, ఇలాంటి పరిస్థితిలో వెంటనే సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. మంత్రి చేసిన సిపిఆర్ స్పష్టంగా అర్థం కావడంతో సర్పంచులు అధికారులు వైద్యులు సిబ్బంది చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధు, కలెక్టర్ గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత, డిఎంహెచ్వో డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement