Friday, April 26, 2024

Janasena| న‌న్ను కాపు కాపు అని అంద‌రంటారు.. కానీ, కాపులే అర్థం చేసుకోవ‌డం లేదు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కాపు సంక్షేమ సేన నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. అందుకే తాను ఓడిపోయానని వెల్లడించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని, వారికి తనపై అభిమానం ఉన్నా, ఎన్నికల్లో వాళ్ల కులాల నేతలకు మాత్ర‌మే ఓట్లు వేసుకున్నారని, వాళ్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు.

కాపులంతా తనకు ఓటేసి ఉంటే భీమవరం, గాజువాకలో గెలిచేవాడినని అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. జాతీయ, అంతర్జాతీయ సినిమాలు చేసే సత్తా తనకుందని స్పష్టం చేశారు. కానీ, సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. రూ.100 కోట్లు సంపాదించిన తృప్తి కంటే, దివ్యాంగులను అక్కున చేర్చుకుంటే వచ్చే తృప్తి మిన్న అని తెలిపారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా తనకు వేల కోట్లు లేవని, కాన్షీరామ్ వంటి వారే పార్టీ నడపడంలో తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. డబ్బు కంటే జ‌న బలంతోనే పార్టీ నడపగలమని పవన్ కల్యాణ్ వివరించారు. అయితే ఇప్పటికీ జనసేనకు ఇంకా ప్రతికూల పవనాలే నడుస్తున్నాయని, అనుకూల పవనాలు రాలేదని అన్నారు.

సొంత మీడియా లేకపోవడం కొన్ని కులాల ప్రతికూలంగా మారిందని అన్నారు. సంఖ్యా బలం ఉన్న కులాల బలంగా గొంతుక వినిపించలేకపోతున్నాయని తెలిపారు. మీరేమో నన్ను దేవుడు, దేవుడు అంటారు… వాళ్లేమో నన్ను చంపుతున్నారు అటూ సభలో నవ్వులు పూయించారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం విస్ఫోటనం చెందిందని, ఆ విధంగా ఏర్పడిన ప్రతి అణువులోనూ తాను భగవంతుడ్ని చూస్తానని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement