Thursday, May 2, 2024

TS: నిజామాబాద్‌లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటు శుభపరిణామం.. కవిత

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 30 (ప్రభ న్యూస్) : అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాదులో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఐటీ అభివృద్ధి ప్రారంభిం చిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు.

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈనెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకుని చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటి హబ్ ను ఇటీవల సందర్శించారు. అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని వివరించారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండానే యువతకు స్థానికంగానే ఉద్యోగ కల్పన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఐటీ హబ్ ఆలోచన చేశారని చెప్పారు. నిజామాబాద్ ఐటీ హబ్ ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement