Monday, April 29, 2024

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.15 శాతం.. ఆమోదించిన కేంద్రం

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) సొమ్ముపై ఇచ్చే వడ్డీరేటును ఖరారు చేశారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటి) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో (ఈపీఎఫ్‌ఓ) సోమవారం నాడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ ఇవ్వాలని ఈ సంవత్సరం మార్చిలో ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. 2021-22లో ఇచ్చిన 8.10 శాతంతో పోల్చితే ఇది 0.05 శాతం ఎక్కువ.

- Advertisement -

ఈ నిర్ణయాన్ని సీబీటీ కేంద్ర ఆర్ధిక శాఖకు పంపించింది. తాజాగా ఆర్ధిక శాఖ కూడా ఇందుకు అనుమతించడంతో వడ్డీరేటుపై ఈపీఎఫ్‌వో ప్రకటన చేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో ఈపీఎఫ్‌ఓ ఫీల్డ్‌ అధికారులు త్వరలోనే ఈ వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 2022 మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించారు. 8.5 శాతంగా ఉన్న వడ్డీరేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది.

1977-78 ఆర్ధిక సంవత్సరంలో 8 శాతం వడ్డీ ఇవ్వగా, ఆ తరువాత 2021-22 ఏడాదిదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. 2015-16 ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.8 శాతం ఉండగా, అప్పటి నుంచి ఒక్క ఏడాది మినహా వడ్డీరేటు క్రమంగా తగ్గించారు. తాజాగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీరేటును స్వల్పంగా పెంచారు. ఇటీవల ఆర్బీఐ వరసగా వడ్డీ రేట్లు పెంచడంతో అన్ని బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచాయి. దీంతో స్వల్పంగా పీఎఫ్‌ వడ్డీరేటు పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement