Thursday, April 25, 2024

నియోజకవర్గానికో ఫైర్‌ స్టేషన్‌.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నాలుగు మంజూరు

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : అసెంబ్లి నియోజకవర్గానికో ఫైర్‌ స్టేషన్‌ను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నియోజకవర్గాల్లో ఫైర్‌ స్టేషన్లు లేని ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తోంది.. అందులో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నాలుగు ఫైర్‌ స్టేషన్లు మంజూరు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాలకు ఫైర్‌ స్టేషన్లు మంజూరు చేశారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి కూడా ఫైర్‌ స్టేషన్‌ మంజూరు చేశారు.

పక్క నియోజకవర్గాల పరిధిలో ఫైర్‌ స్టేషన్లు ఉండటం.. దూరం తక్కువగా ఉండటంతో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పక్క నియోజకవర్గం నుండి ఫైర్‌ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పేవాళ్లు.. నియోజకవర్గంలో తప్పనిసరిగా ఫైర్‌ స్టేషన్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్‌ స్టేషన్లు లేని నియోజకవర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాకు నాలుగు ఫైర్‌ స్టేషన్లు మంజూరయ్యాయి. ఫైర్‌ స్టేషన్లతోపాటు అక్కడ పని చేసే ఆఫీసర్లు, సిబ్బంది నియామకానికి కూడా ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలోనే నియోజకవర్గాల పరిధిలో ఫైర్‌ స్టేషన్లకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఉమ్మడి జిల్లాకు నాలుగు ఫైర్‌ స్టేషన్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement