నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులను గుంటూరు పోలీసులు కాపాడిన ఘటన వైరల్ గా మారింది. గుంటూరు డిస్ట్రిక్ట్ దుర్గి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రవీణ్ కుమార్ సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. షర్ట్ ని ఊతంగా చేసి ఆ యువకులను కాపాడాడు. సరదాగా ఈత కొడదాం అనుకున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో పడ్డారు. నాగార్జున సాగర్ కుడి కాలువలో స్నానం చేయడానికి ముగ్గురు యువకులు దిగారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా వుంది. దీంతో నీటిలోకి దిగిన ముగ్గురు యువకులు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోసాగారు. ఇదే సమయంలో అటువైపు వెళుతున్న దుర్గి కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, ఎస్పీవో వెంకటేశ్వర్లు యువకులను గమనించి వారిని కాపాడారు.
తాను వేసుకున్న చొక్కానే ఊతంగా చేసి సదరు యువకులకు అందించాడు. వారికి సూచనలిస్తూ తన ప్రాణాలకు తెగించి ఎట్టకేలకు యువకులను ఒడ్డుకు చేర్చాడు. యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన కానిస్టేబుల్ ధైర్యం చెప్పారు. యువకులు తల్లిదండ్రులను సమాచారం అందించి అప్పగించాడు. యువకుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్, ఎస్పీవో వేంకటేశ్వర్లును ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే తమ పిల్లల ప్రాణాలను కాపాడిన పోలీసులకు తమ కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటామని తల్లిదండ్రులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..