Friday, May 3, 2024

2డీజీ ఔషధాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసిన డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌

కరోనా మహమ్మారిని నివారించేందుకు డీఆర్‌డీవో తయారుచేసిన 2 డీజీ ఔషధాన్ని సోమవారం నాడు మార్కెట్లోకి రిలీజ్ చేసిన‌ట్లు రెడ్డీస్ ల్యాబ్ ప్రకటన చేసింది. డీఆర్‌డీవోకు చెందిన 2డీజీ (2 డయాక్సీ డి గ్లూకోజ్) ఔష‌ధాన్ని రెడ్డీస్ ల్యాబ్ ఫార్మ‌సీలో త‌యారు చేస్తున్నారు. రెండు నెల‌ల క్రితం 2డీజీ ఔష‌ధాన్ని ఢిల్లీలో కేంద్ర రక్షణ, ఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, హర్షవర్ధన్‌ విడుదల చేశారు. తొలుత‌ 10వేల 2డీజీ డోసులను ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు పంపిణీ చేశారు. పొడి రూపంలో ఉన్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది. క‌మ‌ర్షియ‌ల్‌గా 2డీజీటీఎం పేరుతో ఈ ఔష‌ధాన్ని రెడ్డీస్ ల్యాబ్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది.

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పౌడర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ లాబోరేటరీ సహకారంతో అభివృద్ధి చేసింది. 2డీజీ డ్రగ్‌ను కరోనా రోగులకు అత్యవసర వినియోగానికి ఇటీవల డీసీజీఐ అనుమతి ఇచ్చింది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని డీఆర్‌డీఓ పేర్కొన్న విష‌యం తెలిసిందే. క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్‌డీవో వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement