ప్రభన్యూస్ : భారతీయ పేమెంట్ ఇండస్ట్రీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్నేళ్ల వ్యవధిలోనే డిజిటల్ పేమెంట్ పరిమాణం భారీగా పెరిగింది. భారత యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా ఒక్క అక్టోబర్లోనే 421 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఫెస్టివల్ షాపింగ్ ఇందుకు దృఢంగా దోహదపడింది. ఈ వృద్ధి చాలా విస్తృతమైనది. గ్రామీణ మార్కెట్లు సైతం చక్కటి తోడ్పాటు అందించాయి. ఏడాది పరంగా యూపీఐ పేమెంట్లు 100 శాతం వృద్ధి సాధించి అక్టోబర్లో రూ.7.7 లక్షల కోట్లకు చేరాయి. యూపీఐ మార్కెట్ షేర్ల స్థిరంగా పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో చెల్లింపుల్లో 80 శాతానికిపైగా ఉండగా.. ఆర్థిక సంవత్సరం 2018లో ఇది కేవలం 9 శాతంగా మాత్రమే ఉంది. ఆర్థిక సంవత్సరంలో 2021లో 73 శాతంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వాటా 8-10 శాతంగా ఉందని మోతీలాల్ ఓశ్వాల్ రిపోర్ట్ పేర్కొంది.
2016-17లో కేవలం 1004 కోట్లు డిజిటల్ చెల్లింపులు జరగగా అవి ఏకంగా 5 రెట్లు పెరిగి 2020-21 నాటికి 5,554 కోట్లకు చేరాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయమంత్రి రాజీ చంద్రశేఖర్ బుధవారం లోక్సభలో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ మధ్యనాటికి డిజిటల్ 4,683 కోట్లకు చేరాయన్నారు. ఆర్థిక సంవత్సరం 2019లో ఇవి 3,134 కోట్లు, 2020లో 4,572 కోట్లు, 2021లో 5,554 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు. దాదాపు 1 బిలియన్ కార్డులు, ఇంటర్నెట్ వాలెట్, మొబైల్ అకౌంట్స్, మొబైల్ వాలెట్స్, డిజిటల్ పేమెంట్ విధానాలు లాంటి 2 బిలియన్లకుపైగా పీపీఐలు(ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్) భారత్ వేగవంతమైన వృద్ధికి, ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల మార్కెట్గా ఎదిగేందుకు దోహదపడుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ భారీగా పెరగడం, కొవిడ్ కారణంగా వర్చువల్ లావాదేవీలు పెరగడం కూడా ఇందుకు తోడ్పడ్డాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital