Saturday, May 4, 2024

TS | పోలీస్ శిక్షణా ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ : నూతనంగా నియామకం కానున్న 14 ,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ నిచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా కొత్తగా పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల నియామక ప్రక్రియ తుది దశకు రావడంతో వీరికి శిక్షణ నిచ్చేందుకుగాను ఏర్పాట్లపై నేడు రాష్ట్రంలోని అన్ని పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శిక్షణ విభాగం ఐ.జి. తరుణ్ జోషి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, రానున్న సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిందని, దీనిలో భాగంగానే ఇప్పటివరకు 2018 లో 11,023 , 2020 లో 16,282 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల నియామకాలను చేపట్టిందని అన్నారు. తిరిగి ప్రస్తుత 2023 -24 సంవత్సరంలో 14 ,881 పోలీసు అధికారుల నియామకాలకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. తెలంగాణా పోలీస్ అకాడమీ లో 653, పీటీసీ అంబర్ పెట్.లో 650, వరంగల్ లో 1000, కరీం నగర్లో 442, మేడ్చల్ లో 250, సీటీసీ హైదరాబాద్, కరీం నగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ లలో 250 చొప్పున, టీ.ఎస్ స్పెషల్ పోలీస్ యూసుఫ్ గుడాలో 400, కొండాపూర్ లో450 మందికి, డిచ్ పల్లిలో 350 , మంచిర్యాల లో 325 మందితో పాటు ఇతర శిక్షణా సంస్థల్లో ట్రైనీలకు శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అంజనీ కుమార్ తెలిపారు.

శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముందుగానే అన్ని పీటీసీ లలో మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణకు కావాల్సిన మెటీరియల్స్, వసతి సౌకర్యం తదితర సౌకర్యాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. భవనాలకు మరమ్మతులు, వైట్ వాష్, టాయిలెట్ల సౌకర్యం, రీడింగ్ రూమ్ తదితర ఏర్పాట్లకై నిధులను అందచేస్తున్నామని అన్నారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలల్లో ఉన్న కాళీలను భర్తీ చేయడానికి వెంటనే చర్యలు చేపడుతున్నామని అన్నారు.

- Advertisement -

కొత్తగా ఉద్యోగాలలోకి వచ్చే వారికి మంచి గుణాత్మక శిక్షణనిస్తే, వారు రానున్న 30 నుండి 35 సంవత్సరాలు సమాజానికి మంచి సేవలందిస్తారని డీజీపీ పేర్కొన్నారు. పీటీసీ ప్రిన్సిపాళ్లు సంస్థలోని అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. మంచి శిక్షణ అందించడం ద్వారా సమాజానికి ఉత్తమ సేవ అందించడమే అవుతుందని ఆయన అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు పోలీస్ నియామకాలలో 33 శాతం రిజర్వేషన్లను కల్పించిందని గుర్తుచేశారు. మహిళా ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లుచేయాలని తెలిపారు. హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీ లో అత్యున్నత పోలీస్ శిక్షణ మెటీరియల్ అందుబాటులో ఉందని దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని అంజనీ కుమార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement