Saturday, May 18, 2024

రష్యా విధ్వంసం, అణు విద్యుత్‌ కేంద్రంపై దాడి.. జప్రోజియాపై పుతిన్‌ కన్నెర్ర..

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తగ్గడం లేవు. రోజుకో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ.. రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చొరబడుతున్నాయి. తాజాగా రష్యా చేసిన ఓ దాడి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. ఏకంగా ఉక్రెయిన్‌లోని న్యూక్లియర్‌ ప్లాంట్‌పైనే క్షిపణి దాడికి దిగింది రష్యా.. ఉక్రెయిన్‌లో అతిపెద్ద న్యూక్లియర్‌ ప్లాంట్‌ అయిన జప్రోజియాపై పలుమార్లు దాడులు జరిగినట్టు సమాచారం. అణు విద్యుత్‌ కేంద్రంపై జరిగిన దాడిని ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా ధృవీకరించింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కూడా విడుదల చేసింది. అక్కడ జరిగిన నష్టంపై ఉక్రెయిన్‌ అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. అణు విద్యుత్‌ కేంద్రంపై దాడిని తీవ్రంగా ఖండించింది. దాడిలో ఏదైనా పెద్ద తప్పిదం జరిగితే.. ఆ నష్టం ఊహించుకోవడానికి కూడా వీల్లేకుండా ఉంటుందని, ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించింది.

స్పందించిన రక్షణ సిబ్బంది..

అణు విద్యుత్‌ కేంద్రంపై దాడితో.. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాణ నష్టంతో పాటు.. న్యూక్లియర్‌ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్‌ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. దీంతో అక్కడ భారీ ఎత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికితోడు విష వాయువులు వెలువడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రష్యా దాడితో ఐదు అంతస్తుల శిక్షణా కేంద్రంలో మంటలు చెలరేగాయి. జపోజియా ప్లాంట్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వివరించారు. ఇంతకుముందు.. ఉక్రెయిన్‌ అత్యవసర సేవ ఇక్కడ అనుమతించలేదు. అయితే తరువాత దీనికి అనుమతి లభించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఉక్రెయిన్‌ స్థానిక మీడియా తెలిపింది.

తెల్లవారుజామున దాడి..

ఉక్రెయిన విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 4వ తేదీని ఉదయం, రష్యా జప్రోజియా అణు విద్యుత్‌ ప్లాంట్‌పై కాల్పులు జరిపిందని, దాని కారణంగానే మంటలు చెలరేగాయని తెలిపింది. అత్యవసర సేవా విభాగం అతి కష్టం మీద 6.20 గంటలకు మంటలు అదుపులోకి తీసుకొచ్చిందని వివరించింది. యూనిట్‌ 1 రియాక్టర్‌ కంపార్ట్‌మెంట్‌ అనుబంధ భవనం దెబ్బతిన్నదని పేర్కొంది. ఎంత మేర నష్టం జరిగిందో అంచనా వేయలేదని చెప్పుకొచ్చిన ఉక్రెయిన్‌.. అణు విద్యుత్‌ ప్లాంట్లు, వ్యవస్థలు సక్రమంగా పని చేసే భద్రతకు అవసరమైన అంశాలు సరిగానే కొనసాగుతున్నాయని తెలిపింది. ఎస్‌ఎన్‌ఆర్‌ఐయూ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రైసిస్‌ సెంటర్‌ యాక్టివేట్‌ చేయడం జరిగిందని, ఎస్‌ఎన్‌ఆర్‌ఐయూ, ఎస్‌ఎస్‌టీసీ, ఎన్‌ఆర్‌ఎస్‌ నిపుణులు జప్రోజియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ మేనేజర్‌లతో సంప్రదిస్తున్నారని వివరణ ఇచ్చింది.

- Advertisement -

నాల్గో యూనిట్‌తో విద్యుత్‌ ఉత్పత్తి..

మొదటి యూనిట్‌లో పనులు ఆగిపోయాయని, రెండో, మూడో యూనిట్లు గ్రిడ్‌ నుంచి డిస్‌ కనెక్ట్‌ చేశామని ఉక్రెయిన్‌ తెలిపింది. అణు రియాక్టర్‌ చల్లబడుతోందని, నాలుగో యూనిట్‌ 690 మెగావాట్ల విద్యుత్‌తో పని చేస్తోందని వివరించింది. ఐదో, ఆరో యూనిట్లు కూడా చల్లబడుతున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌ న్యూక్లియర్‌ ఇన్‌స్పెక్టర్లు.. రష్యా దళాలు ఉక్రెయిన్‌ రష్యా దళాలు అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రదేశంలోకి ప్రవేశించాయని వివరించారు. రాత్రి జరిగిన ఘర్షణల్లో మంటలు చెలరేగాయని, పవర్‌ ప్లాంట్‌ సిబ్బంది సాధారణ భద్రతా నిబంధనలకు అనుగుణంగా రియాక్టర్‌ను ఆపరేట్‌ చేయడం, విద్యుత్‌ సరఫరా చేయడం కొనసాగించారని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జప్రోజియా అణు విద్యుత్‌ ప్లాంట్‌ రష్యా సైన్యం నియంత్రణలో ఉందని పేర్కొంది.

1984లో నిర్మాణం..

జప్రోజియా రియాక్టర్‌ ఉక్రెయిన్‌లోని ఎనర్హోదార్‌ అనే పట్టణం వద్ద ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌ మొత్తం ఆరు రియాక్టర్లను ఇక్కడ నిర్మించింది. ఒక్కో రియాక్టర్‌ 950 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1984లో చేపట్టిన వీటి నిర్మాణం.. 1994 వరకు కొనసాగింది. మొత్తం రియాక్టర్‌ల సామర్థ్యం 5.7 గిగావాట్లు. ఇది 40లక్షల కుటుంబాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేయగలదు. ఉక్రెయిన్‌ మొత్తం విద్యుత్‌లో ఈ కేంద్రం వాటా దాదాపు 20శాతం వరకు ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement