Tuesday, May 14, 2024

Delhi | తెలంగాణ భార‌త్ లో భాగం కాదా… మోడీ స‌ర్కార్ ను నిండు స‌భ‌లో నిల‌దీసిన బిఆర్ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆరోపించింది. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆ పార్టీ తరఫున పాల్గొన్న లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వర రావు, కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేవరకు రాజకీయం చేస్తుందని, కానీ ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానం కావాలని హితవు పలికారు.

కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అడుగడుగునా పక్షపాత ధోరణి అవలంబిస్తోందని నామ నాగేశ్వర రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లయిందని, అలాగే నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడి కూడా తొమ్మిదేళ్లయిందని గుర్తుచేస్తూ.. ఈ తొమ్మిదేళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన హామీల ప్రకారం తన నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సి ఉందని, అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు.

స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకపోగా, కోచ్ ఫ్యాక్టరీలను వేరే రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణలో ఏర్పాటు చేయలేదని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ట్రైబల్ యూనివర్సిటీ వంటి హామీలు కూడా అమలు కాలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు కొత్తగా మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం, తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

- Advertisement -

ఈ పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తున్నామని నామ నాగేశ్వర రావు ప్రకటించారు. మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ తన నియోజకవర్గానికి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), కేంద్రీయ విద్యాలయాలు సహా అనేక విద్యా సంస్థలు, ఆస్పత్రులు వచ్చాయని, రహదారి సదుపాయాలు మెరుగుపడ్డాయని చెప్పారని.. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని నామ నాగేశ్వర రావు నిలదీశారు. తెలంగాణ భారతదేశంలోనే భాగం కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం అడిగినా సరే నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదని, అప్పటికే మంజూరైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ – ఐటీఐఆర్  ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసిందని మండిపడ్డారు. తెలంగాణ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కేంద్రం కాపీ చేస్తోందని, మంచి ఆలోచనను కాపీ చేయడంలో తప్పేమీ లేదని నామ నాగేశ్వర రావు అన్నారు. మిషన్ భగీరథ పేరుతో తాము ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి పైప్ లైన్ల ద్వారా అందజేస్తున్నామని, ఈ పథకాన్ని హర్ ఘర్ జల్ పేరుతో కేంద్రం అమలు చేస్తోందని అన్నారు.

అలాగే రైతు బంధు పేరుతో రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ఈ పథకాన్ని కూడా కాపీ చేస్తూ కేంద్రం రైతులకు నిధులు అందజేస్తోందని తెలిపారు. అయితే ప్రతి ఇంటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకానికి కేంద్రం ఆర్థిక చేయూతనివ్వాలంటూ నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా సరే కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని నామ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి నీళ్లు లేని దుస్థితి ఉండేదని, ఇక విద్యుత్తు విషయంలో రాష్ట్రం అంథకారంలో ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.

అన్ని రాష్ట్రాలకు నిధులిస్తున్న కేంద్రం, తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని నామ ఆరోపించారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే జోక్యం చేసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 86 వేల కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందని గుర్తుచేశారు. ఆ తర్వాత నామ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అగ్రరాజ్యం అమెరికాలోనైనా పవర్ కట్ ఉండొచ్చేమో కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదని వ్యాఖ్యానించారు. ఇక వ్యవసాయ దిగుబడుల్లో పంజాబ్ వంటి అగ్ర రాష్ట్రాన్ని అధిగమించి రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధించామని చెప్పారు.

పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణయే నెంబర్ 1 స్థానంలో ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా సరే తాము ఈ ఘనత సాధించగలిగామని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. కేంద్ర అనేక అంశాల్లో విఫలమైందని అన్నారు. చమురు ధరలు పెరిగాయని, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయిందని అన్నారు.

మణిపూర్‌కు అఖిలపక్షం

ఈ దశలో కొందరు సభ్యులు బీఆర్ఎస్ ఎటు వైపు ఉంది అంటూ కామెంట్లు చేశారు. వాటికి బదులిస్తూ.. తాము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కూడా కాదని నామ నాగేశ్వర రావు తేల్చి చెప్పారు. తమ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి అని, తాము దేశ ప్రజలతో ఉన్నామని అన్నారు. మణిపూర్ విషయంలో ప్రపంచంలో భారత్ తలదించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. 15వ లోక్‌సభ సమయంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, ఆ సమయంలో కాశ్మీర్ హింసపై అఖిలపక్షం డిమాండ్ చేస్తే తాము సుష్మాస్వరాజ్ వెంట నిలిచామని గుర్తుచేశారు. ఇప్పుడు మణిపూర్ విషయంలో కూడా అఖిలపక్షాన్ని అక్కడికి తీసుకెళ్లాలని కేంద్రానికి సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement