Friday, May 17, 2024

Delhi | ఢిల్లీ అధికారులు ప్రజలు ఎన్నుకున్న వారికి రిపోర్ట్ చేయాలా.. పాలకులకా: బీఆర్‌ఎస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ తరఫున బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఢిల్లీ అధికారులు ఎవరికి రిపోర్ట్ చేయాలి? వారి బాధ్యతలు-అధికారాలు ఏంటి? దీనికి ఎవరు జవాబుదారి? అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏమైదని నిలదీశారు.

నాటు నాటు పాటలాగా ఢిల్లీ సీఎం, హోంమంత్రిని ప్రధాని మోదీ ఆడిస్తున్నారని రంజిత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని చెప్పారు. ఢిల్లీ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్‌కి రిపోర్ట్ చేయాలా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలా అనేది తేలాల్సి ఉందన్నారు. చక్కగా ప్రసంగం చదివిన అమిత్ షా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం అధికారాలన్నీ ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని ఆయన తెలిపారు. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను చేజిక్కించుకోవాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని నొక్కి చెప్పారు.

- Advertisement -

బీజేపీ ప్రభుత్వం 80 ఆర్డినెన్స్ లు తెచ్చిందన్న ఆయన, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మాత్రం రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని నొక్కి చెప్పారు. ఢిల్లీ అధికారులు ప్రజలు ఎన్నుకున్న వారికి రిపోర్ట్ చేయాలా..? పాలకులకు రిపోర్ట్ చేయాలా? అని రంజిత్ రెడ్డి అడిగారు. సీఎం ఛైర్మన్‌గా ఏర్పాటు చేస్తున్న అథారిటీలో ఇద్దరు అధికారులు కేంద్రం నియంత్రణలోనే ఉంటే సీఎం చేసేదేముంటుందన్నారు. అథారిటీలన్నీ కేంద్రం చేతిలోనే ఉంటే అధికారులంతా లెఫ్టినెంట్ గవర్నర్‌కి రిపోర్ట్ చేస్తారు గానీ సంబంధిత మంత్రులకు చేయరని, ఇది హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement