Monday, May 6, 2024

తెలుగు వారి వెలుగు దీప్తి NTR : జ‌స్టిస్ ఈవీ వేణుగోపాల్‌

తెలుగు వారి వెలుగు దీప్తి నంద‌మూరి తార‌క రామారావు అని తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఈవీ వేణుగోపాల్‌ కొనియాడారు. ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకోవ‌డం, ప్ర‌తి తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఎన్టీ రామారావు
తెలుగు వారిగా జ‌న్మించ‌డం మ‌నంద‌రికి గర్వ‌కార‌ణ‌మ‌న్నారు. తెలుగు వారిని అవ‌మానిస్తున్న తీరును భ‌రించ‌లేక‌, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌ను ద‌శ దిశ‌లా చాటుతూ ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవ‌లం 9 నెల‌ల వ్య‌వ‌ధిలోనే పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. రాజ్యాంగం ప్ర‌సాదించిన స‌మాన‌త్వ హ‌క్కును అమ‌లు చేసి చూపించార‌ని చెప్పారు. ప్రతి పేదవానికి కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చి వారి ఆకలి తీర్చిన ఘనత అన్న గారికే దక్కిందన్నారు. ఎన్టీఆర్ మ‌నిషి కాద‌ని, మ‌నిషి రూపంలో జ‌న్మించిన పుణ్య పురుషులని తెలిపారు. మ‌ద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి తీవ్ర అవ‌మానాలు ఎదుర‌య్యేవ‌ని, అలాంటి ప‌రిస్థితిని ఎన్టీఆర్ మార్చార‌ని చెప్పారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు తెలుగు వారికి ప్ర‌త్యేక గౌర‌వం తీసుకువచ్చిన ఘ‌న‌త ఎన్టీఆర్ కే ద‌క్కుతుంద‌ని చెప్పారు.  అందుకే ప్ర‌తి కుటుంబం ఆయ‌న‌ను పెద్ద కొడుకును చేసుకుని, అన్న‌గారు అని పిలుచుకుంటుంద‌ని తెలిపారు.  ప్రతి తెలుగువాని ఇంట్లో అన్న‌గారి ఫొటో ఉంటుంద‌ని చెప్పారు. అదే విధంగా ప్ర‌తి గ్రామంలో అన్న‌గారి కాంస్య విగ్ర‌హం ఉంటుంద‌ని ఇది ఆయ‌న‌కు తెలుగు వారు ఇచ్చే గౌర‌వంగా పేర్కొన్నారు.
మంత్ర ముగ్దుల్ని చేసిన జ‌స్టిస్ వేణుగోపాల్‌ ప్రసంగానికి ప్రేక్షకులు తమ సీట్ల నుండి లేచి కరతాళ ధ్వనులు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement