Monday, April 29, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు

తిరుమల, ప్రభన్యూస్‌ : వారాంతం కావడం, సోమవారంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1,2, కంపార్టుమెంట్లు పూర్తిగా నిండి కిలోమీటర్లమేర భక్తులు క్యూ లైన్‌లలో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. దీంతో సర్వదర్శనానికి 30 గంటలు సమయం పడుతుంటే, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో విఐపి బ్రేక్‌ దర్శనాలను టీటీడీ ప్రోటోకాల్‌ పరిధిలోని వ్యక్తులకు మాత్రమే కేటాయిస్తోంది.. శ్రీవారి దర్శనార్ధం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో తిరుమలలో ఎటుచూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్‌లే దర్శనమిస్తున్నాయి.

ఇక అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాలతో పాటు రోడ్డు మార్గం గుండా భారీగా భక్తులు తిరుమలకు తరలివస్తుండడంతో శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండిపోయి క్యూలైన్‌లు వెలుపలకు వ్యాపించాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటుచేసిన షెడ్లు కూడా నిండి ఆళ్వార్‌ ట్యాంక్‌ మార్గం గుండా నారాయణగిరి అతిథిగృహాల మీదుగా శిలాతోరణం రోడ్డు వరకు భక్తులు క్యూలైన్‌లో వేచివున్నారు.

- Advertisement -

క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు టీటీడీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకుల సహాయంతో ఎప్పటికప్పుడు తాగునీరు, అల్పాహారం లాంటివి అందచేస్తూ క్యూలైన్‌లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా గదులు దొరక భక్తులు టిటిడి ఏర్పాటు చేసిన లాకర్లను పొంది చెట్ల షెడ్లక్రింద సేదతీరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement