Friday, May 3, 2024

నిరుద్యోగుల‌ను మ‌భ్య‌పెట్టే దుష్ట ఆలోచ‌నే అగ్నిప‌థ్ – సీపీఐ నారాయ‌ణ‌

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన అగ్నిప‌థ్ ప్ర‌క‌ట‌న‌లోనే మోసం ఉంద‌ని మండిప‌డ్డారు సిపిఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌.
అగ్నిపధ్ విధానం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. భారత సాయుధ దళాల్లో 4 ఏళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపధ్ విధానం తీవ్ర హింసకు దారి తీస్తుంది. ఆర్మీ ఆశావాహులు నిరసనలకు దిగుతూ.. పలు రైళ్లకు నిప్పంటించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు ఓ రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీనిపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పందించారు. ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ మోడీ చేసిన ప్రకటన మోసపూరితమైనదని విమర్శించారు. నిరుద్యోగులను మభ్యపెట్టే దుష్ట ఆలోచనతోనే అగ్నిపధ్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఉందని మండిపడ్డారు. సైనిక నియామక విధానాన్ని ఇప్పటికిప్పుడే మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారని, జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు అదే కారణమని స్పష్టం చేశారు. కేంద్రం ఇకనైనా స్పందించి సాయుధ దళాల నియామకాల్లో పాత పద్ధతినే కొనసాగించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement